Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్వస్థలమైన మష్హద్లోని పవిత్ర ఇమామ్ రెజా దర్గా ప్రాంగణంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మష్హద్లో వేలాది మంది ప్రజలు ఇరాన్ జెండాలు, ఖమేనీ చిత్రపటాలు, విప్లవ నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంగారు గోపురంతో ప్రసిద్ధి చెందిన ఇమామ్ రెజా దర్గా దగ్గర భారీగా భక్తులు, మద్దతుదారులు చేరుకుని ఖమేనీకి తుది నివాళులర్పించారు.
‘ట్రంప్ను చంపాలి’ ప్లకార్డులు
అంత్యక్రియల సందర్భంగా కొందరు మద్దతుదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మా సుప్రీం లీడర్ రక్తంపై ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్ను చంపుతాం’’ అంటూ నినాదాలు వినిపించాయి. కొందరు మహిళలు ‘‘Kill Trump’’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ‘‘డెత్ టు అమెరికా’’ వంటి విప్లవ నినాదాలు కూడా వినిపించాయి.
ఖమేనీ మరణానంతరం కొత్త సుప్రీం లీడర్గా ప్రకటించబడిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ ప్రజల ముందుకు రాలేదు. దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ముఖం, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నట్లు టెహ్రాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఆయన నుంచి లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే వెలువడ్డాయి. వీడియోలు, ఆడియోలు లేదా ప్రత్యక్ష ప్రసంగాలు బయటకు రాలేదు.
ఖమేనీ పార్థివదేహాన్ని గత వారం రోజులుగా టెహ్రాన్, ఖోమ్, ఇరాక్లోని నజఫ్, కర్బలా వంటి పవిత్ర నగరాల్లో ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లారు. ప్రతి చోట భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని షియా మత ప్రార్థనలు, విప్లవ నినాదాల మధ్య నివాళులర్పించారు. అనంతరం మష్హద్కు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
దాదాపు 37 సంవత్సరాల పాటు ఇరాన్ను నడిపించిన ఖమేనీ మరణంతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయన హయాంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రభావం మరింత పెరిగింది. అధ్యక్షుడు, పార్లమెంట్ కంటే సుప్రీం లీడర్ అధికారాలు బలపడేలా ఆయన వ్యవస్థను రూపుదిద్దారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే మరోవైపు ఖమేనీ పాలనపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఆంక్షలు, నిరసనల అణచివేత, పెరుగుతున్న జీవన వ్యయం వంటి అంశాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల అనంతరం వేలాది మంది మరణించారని మానవ హక్కుల సంస్థలు ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం వాటిని ఖండిస్తోంది. ఇదిలా ఉండగా యుద్ధం అనంతరం ఇరాన్ వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధిపై తన ప్రభావాన్ని కొనసాగించినప్పటికీ, దేశీయంగా ఆర్థిక ఒత్తిడి, పునర్నిర్మాణ సవాళ్లు ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.