July 9, 2026

CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!

CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
Reading Time: 2 minutes
Cm Revanth Reddy Telangana To Become A 3 Trillion Dollars Economy By 2047 Focus On Infrastructure And Investments

CM Revanth Reddy: తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. అధికారం కోల్పోయిన బాధ ఉన్నా అభివృద్ధిని అడ్డుకోవద్దని, తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న సుమారు 2,100 చ.కి.మీ. ప్రాంతాన్ని CURE (Clean Urban Region Ecosystem) ఏరియాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని CURE, PURE, RARE ప్రాంతాలుగా విభజించి సమతుల అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10% వాటా సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాలంటే మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATCs), స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్న సీఎం.. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఉపాధి కోసం వ్యాపార సముదాయాలు నిర్మించి అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రైతులు చేసిన త్యాగాల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని సీఎం కొనియాడారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సీతారాంపూర్‌లో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి త్వరలో మరోసారి వస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో తెలంగాణను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.