IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..

IND-UK FTA: యునైటెడ్ కింగ్డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15న అమలులోకి వస్తోంది. భారత్లోకి వచ్చే బ్రిటిష్ వస్తువులపై గణనీయంగా ధరలు తగ్గబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, ఇతర ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కార్ల ధరలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్ , ఆస్టన్ మార్టిన్ వంటి కార్లు చౌక ధరలకే లభిస్తాయి.
చౌకగా కార్లు:
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య చాలా వస్తువులపై సున్నా లేదా తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం, మొదటి ఏడాది 20,000 కార్లను తగ్గించిన సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. 3000 సీసీ(పెట్రోల్), 2500 సీసీ(డీజిల్)కి పైబడిన 10,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తారు. 1500 సీసీ నుంచి 3000 సీసీ శ్రేణిలోకి వచ్చే 5000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ కార్లపై దిగుమతి సుంకాన్ని 66 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తారు. దీని తర్వాత క్రమంగా సుంకాలను తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఈ కార్లపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తారు. దీంతో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్, రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
99 శాతం భారతీయ వస్తువులపై జీరో టారిఫ్:
ఇదే సమయలో భారత్ నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే వస్తువులపై జీరో టారిఫ్ ఉంటుంది. యూకేలో వస్త్రాలపై 12 శాతం సుంకం, రసాయనాలపై 8 శాతం, బేస్ మెటల్స్పై 10 శాతం సుంకం ఉంటుంది. కానీ ఇప్పుడు, ఈ ఒప్పందంతో, యూకేలో 99 శాతం వస్తువులు ‘0%’ సుంకం పరిధిలోకి వస్తాయి.
సగం ధరకే స్కాచ్ విస్కీ:
ప్రస్తుతం భారతదేశంలో స్కాచ్ విస్కీపై 150 శాతం దిగుమతి సుంకం ఉంది. ఎఫ్టీఏ అమలులోకి వచ్చిన తర్వాత ఈ సుంకాన్ని దశల వారీగా 40 శాతం వరకు తగ్గించనున్నారు. ఏకంగా 110 శాతం తగ్గడం ద్వారా బ్రిటిష్ స్కాచ్ విస్కీ చౌకగా మారుతుంది.