ఆ ఒక్క పాము.. స్కూల్ లోని నలుగురు పిల్లలను కాటేసి వెళ్లింది..!

ఒక్క పాము.. నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థులను కాటు వేసింది.. విద్యార్థుల్లో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు రాత్రిపూట భోజనం చేసి ఓ గదిలో నిద్రిస్తుండా ఈ ఘటన జరిగింది..ఈ ఘటన ప్రభుత్వ స్కూల్స్ , హాస్టళ్లలో విద్యార్థుల సేఫ్టీపై ఆందోళనకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్లోని లోహర్దగా జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న నలుగురు స్టూడెంట్స్ ను పాము కాటేయడంతో 12 ఏళ్ల బాలిక మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కురు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోచో మహువటోలిలో ఉన్న సంవాసిర సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ మంగళవారం(జూలై 7) రాత్రి ఈ ఘటన జరిగింది. భోజనం అనంతరం ఏడుగురు విద్యార్థినులు కింది అంతస్తులోని హాస్టల్ గదిలో నిద్రిస్తుండగా కట్లపాము రూంలోకి ప్రవేశించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.
మొదట ఒక విద్యార్థినిని పాము కాటు వేయగా, ఆమె కేకలు వేయడంతో మిగతావారు మేల్కొన్నారు. అయితే అప్పటికే మరో ముగ్గురు విద్యార్థినులను కూడా పాము కాటేసినట్లు అధికారులు వెల్లడించారు.
పాము కాటుకు గురైన వారిలో స్నేహ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలౌడి నవటోలికి చెందిన 12 ఏళ్ల వర్ష ఓరాన్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇద్దరు విద్యార్థినులు లోహర్దగా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో బాలికను మెరుగైన వైద్యం కోసం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ గదిలోకి పాము ఎలా ప్రవేశించిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.