Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి

ఆమె ఐపీఎస్ ఆఫీసర్. పైగా 9 నెలల నిండు గర్భిణీ. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇలాంటి సమయంలో తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. నిండు చూలాలిగా ఉన్న మధ్యప్రదేశ్లోని ఏఎస్పీ అను బెనివాల్ ‘‘రన్ ఫర్ సైబర్ సేఫ్టీ’’ పాల్గొని ఫిట్నెస్తో పాటు అంకితభావాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
అను బెనివాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో శుభవార్తను పంచుకున్నారు ‘‘దేవుడు.. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నేను నా గర్భం చివరి నెలలోకి ప్రవేశిస్తున్నాను. ఈ సమయంలో నా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూనే.. పని, బాధ్యతలను నాపై నమ్మకంతో అప్పగించిన నా సీనియర్ సహోద్యోగులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మధ్యప్రదేశ్ పోలీసుల ‘సేఫ్ క్లిక్ 2.0’ ప్రచారంలో భాగంగా ‘రన్ ఫర్ సైబర్ సేఫ్టీ’ నిర్వహించబడింది. అందులో నేను కూడా పాల్గొన్నాను.’’ అని రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.
అను బెనివాల్..
అను బెనివాల్ 1992 ఏప్రిల్ 26న జన్మించారు. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం జబల్పూర్లో ఏఎస్పీగా పనిచేస్తున్నారు. ఢిల్లీలోని పీతాంపుర వాస్తవ్యురాలైన అను. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆయుష్ జాఖర్ను వివాహం చేసుకున్నారు. డాక్టర్ ఆయుష్ జాఖర్ పీఎంటీలో రాష్ట్ర టాపర్గా నిలిచి.. ఎయిమ్స్ జోధ్పూర్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దిలీప్ జాఖర్ కుమారుడు.
పదేపదే వైఫల్యాలతో నిరాశ చెందే అభ్యర్థులందరికీ ఐపీఎస్ అధికారిణి అను బెనివాల్ విజయగాథ ఒక స్ఫూర్తి. అను తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో తాను కోరుకున్న విజయాన్ని సాధించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని హిందూ కళాశాల నుంచి బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ పూర్తి చేసిన తర్వాత.. చాలా సంవత్సరాలు నానోసైన్స్ పరిశోధన రంగంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె పరిపాలనా సేవలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎదురుదెబ్బలు తగిలినా అను బెనివాల్ వెనుకాడలేదు.
మొదటి ప్రయత్నం (2018): ప్రిలిమినరీ పరీక్షలో విఫలమయ్యారు.
రెండవ ప్రయత్నం: మెయిన్ పరీక్షకు చేరుకున్నారు.
మూడవ ప్రయత్నం: 683వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించారు. కానీ తాను కోరుకున్న ఐపీఎస్ కేడర్ను పొందలేకపోయారు.
నాలుగవ ప్రయత్నం (2022): 217వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించి.. తన కలను నెరవేర్చుకుని, మధ్యప్రదేశ్ కేడర్లో ఐపీఎస్ అధికారి అయ్యారు.