Meghalaya Honeymoon Murder Case: ‘నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు’.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..

Meghalaya Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ కేసులు బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాను అమాయకురాలినని, ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. మేఘాలయ హైకోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ సోనమ్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్ కేసు కేవలం అనుమానాలు, కొన్ని పరిస్థితుల ఆధారంగానే నడుస్తోందని, కేవలం ఆరోపణలనే నేర నిరూపణగా పరిగణించలేమని ఆమె పేర్కొంది. మేఘాలయ హైకోర్టు జూన్ 29న ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఈ అఫిడవిట్ దాఖలైంది. అయితే, ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సోనమ్ను మళ్లీ జైలుకు పంపడానికి నిరాకరించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత ఆమె ఇప్పటికే విడుదలైనందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. నిందితులపై వచ్చిన ఆరోపణలు విచారణ (Trial) సమయంలోనే నిరూపించాలని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు ఎవరినైనా అమాయకులుగానే భావించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
అరెస్టు ప్రక్రియలో కేవలం సాంకేతిక లేదా విధానపరమైన లోపం ఉందనే కారణంతోనే బెయిల్ మంజూరు చేసి ఉంటే.. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ నిందితులను మళ్లీ అరెస్టు చేయడానికి అధికారులకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విచారణ సమయంలో సోనమ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఆమె అరెస్టుకు గల కారణాలను సరిగ్గా తెలియజేయలేదని, అరెస్టు సమయంలో సరైన చట్టపరమైన సహాయం కూడా అందలేదని వాదించారు. అయితే, ఈ అభ్యంతరాలను అంతకుముందు కింది కోర్టులలో బెయిల్ దరఖాస్తుల సమయంలో ఎందుకు లేవనెత్తలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మేఘాలయ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఇది అత్యంత ఘోరమైన, ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని అన్నారు. అరెస్టు పత్రాలలో జరిగిన ఒక చిన్న టైపింగ్ (Typographical) పొరపాటు ఆధారంగానే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.
అరెస్టు మెమోలో హత్యకు సంబంధించిన సెక్షన్ 103 (BNS) కు బదులుగా, పొరపాటున సెక్షన్ 403 అని టైప్ చేశారని.. ఇది కేవలం క్లరికల్ తప్పిదం మాత్రమేనని, దీనివల్ల నిందితురాలికి ఎలాంటి నష్టం జరగలేదని మెహతా వాదించారు. గతంలో మూడు సార్లు సోనమ్ బెయిల్ దరఖాస్తులను కోర్టులు తిరస్కరించాయని, ఆమెకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అరెస్టు మెమోలో జరిగే ఇలాంటి టైపింగ్ పొరపాట్లు.. అరెస్టును రద్దు చేయడానికి లేదా బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదిక అవుతాయా లేదా అనే చట్టపరమైన అంశాన్ని పరిశీలించడానికి ఈ కేసును మరింత ఇతర బెంచ్కు బదిలీ చేసే విషయాన్ని సైతం సుప్రీంకోర్టు పరిశీలిస్తామని పేర్కొంది.
అసలేంటి ఈ రాజా రఘువంశీ హత్య కేసు?
ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మే 2025 లో తన భార్య సోనమ్తో కలిసి మేఘాలయకు హనీమూన్ ట్రిప్కు వెళ్లారు. అయితే, నోంగ్రియాట్లోని ఒక హోమ్స్టే నుంచి చెక్ అవుట్ చేసిన తర్వాత ఈ దంపతులు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సోహ్రా లోని ‘వైసాడంగ్ జలపాతం’ (Weisawdong Falls) సమీపంలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరికొందరు నిందితులతో కలిసి సోనమ్ తన భర్తను చంపడానికి పక్కా ప్లాన్ వేసిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 700 కి పైగా పేజీలతో కూడిన భారీ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో సాక్షుల విచారణతో ట్రయల్ కొనసాగుతోంది.