Reading Time: < 1 minute

వెస్టిండీస్ క్రికెట్‌‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. వెస్టిండీస్ ఆటగాడు, ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున గతంలో ప్రాతినిథ్యం వహించిన పేసర్ జేవన్ సీర్లెస్‌పై ఐసిసి వేటు వేసింది. 2023-24 బిమ్ టి-10 లీగ్‌లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐసిసి అతడిని సస్పెండ్ చేసింది.

క్రికెట్ వెస్టిండీస్, ఐసిసి అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసిసి గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా సీర్లెస్ వ్యవహరించినట్లు విచారణలో తేలింది. అతడితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, టీమ్ అధికారి ట్రెవాన్ గ్రిఫిత్‌లపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది.

సీర్లెస్‌పై నాలుగు ఛార్జీలు నమోదు కాగా, చిత్రంజన్‌పై మూడు, గ్రిఫిత్‌పై ఒక ఛార్జ్ నమోదు అయింది. తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించేందుకు వీరికి 14 సమయానికి ఐసిసి ఇచ్చింది. మరోవైపు ఇదే బిమ్ టి-10 లీగ్ వ్యవహారంలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్‌పై కూడా ఐసిసి సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు టి-20 ప్రపంచకప్-2026కు దూరమయ్యాడు.