
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) పాఠశాలల్లో మూడు భాషల విధానాన్ని (Three-Language Formula) అమలు చేయడంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సుల ప్రకారం భాషా అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా, విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా రూపొందించనున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. అయితే, ప్రస్తుతం చదువుతున్న పలు తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల విషయంలో సీబీఎస్ఈ పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు మినహాయింపు
సీబీఎస్ఈ తీసుకొచ్చిన ఈ కొత్త మూడు భాషల విధానం ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో 10వ తరగతికి వెళ్లినప్పుడు కూడా ఈ మూడో భాషలో ప్రత్యేకంగా బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రస్తుత హైస్కూల్ విద్యార్థులపై ఎలాంటి అదనపు పరీక్షల భారం పడబోదు.
రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. ద్విభాషా బోధన
జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం విద్యార్థులు నేర్చుకునే మూడు భాషల్లో కనీసం రెండు అధికారిక భారతీయ భాషలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో రెండో భాషగా రెండు భారతీయ భాషలను చదువుతున్న విద్యార్థులు, ఇకపై వాటితో పాటు ఒక అదనపు భారతీయ భాషను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరికొత్త భాషలను సులభంగా నేర్చుకునేందుకు వీలుగా, వారి తరగతి స్థాయికి అనుగుణంగా బోధనా సామగ్రిని ద్విభాషా (బైలింగ్వల్) రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వెల్లడించింది. సంస్కృతిని, భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.