Reading Time: < 1 minute
Pm Narendra Modi Receives Seychelles Highest Environmental Honour

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. షీషెల్స్ ప్రభుత్వం అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్’’(Guardian of the Blue Horizon) అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి , వాతావరణ మార్పులు నియంత్రణలో నాయకత్వానికి గానూ ఈ అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు ద్వారా పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీ, సుస్థిర అభివృద్ధి, సముద్ర వనరుల బాధ్యతాయుత వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో మోదీ చూపిన నాయకత్వాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రశంసించింది. చిన్న ద్వీప దేశాల అభివృద్ధి, వాతావరణ స్థిరత్వం కోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రస్తావించింది.

ఈ అవార్డుపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ అవార్డును వినమ్రంగా స్వీకరిస్తున్నానని, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు ఎదుర్కొంటున్న దేశాల ప్రజలకు, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించే ప్రతీ ఒక్కరికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

మే 2026లో, ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని మార్చడం,సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు గాను, ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాని మోడీకి ‘‘అగ్రికోలా’’ పతకాన్ని ప్రదానం చేసింది. అంతకుముందు, 2018లో, సుస్థిర ఆర్థిక వృద్ధి, ప్రపంచ సహకారం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించినందుకు గాను ఆయన ‘‘సియోల్ శాంతి బహుమతి’’ని అందుకున్నారు. అదే సంవత్సరం, వాతావరణ చర్యలు, అంతర్జాతీయ పర్యావరణ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఆయన నాయకత్వాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి తన అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ను ఆయనకు ప్రదానం చేసింది.