Reading Time: < 1 minute
Mohammad Kaif Warns Vice Captain Tilak Varma After India Loss To Ireland In First T20

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హెచ్చరిక చేశారు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉన్న ప్రస్తుత మేనేజ్‌మెంట్‌లో ఏ ఆటగాడి స్థానమూ శాశ్వతం కాదని, కేవలం వైస్ కెప్టెన్ హోదా ఉన్నంత మాత్రాన జట్టులో చోటు సురక్షితం అనుకుంటే పొరపాటేనని స్పష్టం చేశారు. ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఎవరినైనా తొలగించడానికి యాజమాన్యం వెనుకాడదని, గతంలో అక్షర్ పటేల్ స్థానంలో తిలక్‌ను తీసుకు రావడమే అందుకు ఉదాహరణని గుర్తుచేశారు. సీనియర్ ఆటగాళ్లకు సంబంధించి ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయాలే దీనికి నిదర్శనమని కైఫ్ పేర్కొన్నారు.

ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 21 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి విఫలమవ్వడం, ఆ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోవడంతో కైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు, తమ కెప్టెన్ లార్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో 20 ఓవర్లలో 182/9 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ లైన్ అప్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఐర్లాండ్ బౌలర్లు మాథ్యూ హంఫ్రీస్, మాట్ హాలార్డ్ తలో మూడు వికెట్లు తీసి భారత వికెట్లను దెబ్బతీశారు. అలాగే అరంగేట్రం చేసిన జై మూంద్రా కూడా 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత జట్టు 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను సమం చేయాలంటే, ఆదివారం జరగబోయే రెండో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం ఖచ్చితంగా పుంజుకోవాల్సి ఉంది.