Reading Time: < 1 minute
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రైల్ బిల్లులను అప్పగించనుంది. దీని ద్వారా మహిళలు ఆదాయం పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. త్వరలోనే మహిళలకు రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. దానికనుగుణంగా ఇప్పుడు అడుగులు వేస్తోంది.

పొంగులేటి కీలక ప్రకటన

మహిళలకు ఆధునిక రైస్ మిల్లులను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి భాగస్వామ్యంతో మహిళలకు రైస్ మిల్లులు కేటాయిస్తామని, నేలకొండపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో మహిళా సంఘాలకు ఇప్పటికే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ వంటి వాటిని అప్పగించామని, ఈ కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతమయ్యాయని అన్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రైస్ మిల్లుల కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ పొలాల్లో పండించిన ధాన్యాన్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి మిల్లులోనే నాణ్యమైన బియ్యంగా మార్చి మార్కెటింగ్ చేసేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతీ పథకంలోనూ మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, రైస్ మిల్లలు వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా దళారీల వ్యవస్థకు కూడా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం తెలిపింద. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు ఉపయోగించుకోవాలని పొంగులేటి సూచించారు.