
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారిని లిఫ్ట్ ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు కూలిపోవడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
జ్యుడీషియల్ డిపార్ట్మెంట్లో CAOగా పనిచేసి రిటైర్ అయిన తిరునగరి నరసింహస్వామి.. కొత్త ఫ్లాట్ కొనుగోలు చేద్దామనుకున్నారు. ఇందుకోసం తన బంధువులతో కలిసి, ఎస్టేట్ ఏజెంట్ దిలీప్ కుమార్ ద్వారా హనుమాన్ నగర్లోని ఓ అపార్ట్మెంట్కు వచ్చారు. బిల్డింగ్లోని 501 నంబర్ ఫ్లాట్ను పరిశీలించేందుకు వీరంతా లిఫ్ట్లో ఐదో అంతస్తుకు వెళ్లారు. ఫ్లాట్ చూసుకున్న తర్వాత.. ఎనిమిది మంది బంధువులు కలిసి తిరిగి కిందకు వచ్చేందుకు అదే లిఫ్ట్ ఎక్కారు. అయితే, నాలుగో అంతస్తుకు రాగానే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది.. మరుక్షణమే ఊహించని విధంగా నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కు కూలిపోయింది.
లిఫ్ట్ బలంగా కిందపడటంతో అందులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడి ఆర్తనాదాలు చేశారు. ప్రమాదం గమనించిన స్థానికులు, క్షతగాత్రులను వెంటనే ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో తిరునగరి నరసింహస్వామి, పద్మిని, వెంకటేశ్వర్లు, నిర్మల, గోపాలస్వామి, రేణుక, పద్మ, శోభ ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులే కావడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉంది. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. లిఫ్ట్ సామర్థ్యానికి మించి జనం ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక అపార్ట్మెంట్లో లిఫ్ట్ నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.