Reading Time: 2 minutes
Bjp Hits Back At Sonia Gandhi Over Gaza Remarks India Foreign Policy Palestine

గాజా యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సోనియాగాంధీ వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. గాజా, పాలస్తీనా అంశాలపై భారత్ ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టంగా వెల్లడించడమే కాకుండా మానవతా సహాయం కూడా అందించిందని గుర్తుచేసింది.

ఇటీవల సోనియా గాంధీ ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో గాజా సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ‘‘మౌనం’’ పాటిస్తోందని, ఇజ్రాయెల్ చర్యలపై స్పందించకపోవడం నైతికంగానే కాకుండా జాతీయ ప్రయోజనాల పరంగా కూడా సమర్థించలేని విషయమని విమర్శించారు. అలాగే పాలస్తీనా, ఇరాన్ వంటి సంప్రదాయ మిత్ర దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయని.. అంతర్జాతీయ సమాజం నుంచి దూరమైందని.. దీనివల్ల పాకిస్థాన్‌కు మధ్యవర్తిగా ఎదిగే అవకాశం కల్పించిందని ఆరోపించారు.

బీజేపీ ఘాటు స్పందన

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. కాంగ్రెస్ విదేశాంగ విధానాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలోనే చూస్తోందని విమర్శించారు. ‘‘సోనియా గాంధీ తన వ్యాసం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గాజా, పాలస్తీనా అంశాలపై భారత్ అనేకసార్లు తన అధికారిక వైఖరిని వెల్లడించింది. అంతేకాదు, మానవతా సహాయం కూడా అందించింది.’’ అని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. గాజా అంశంపై ఐక్యరాజ్యసమితిలో కాల్పుల విరమణ తీర్మానాలకు భారత్ మద్దతు తెలిపిందని పూనావాలా గుర్తు చేశారు. అలాగే పాలస్తీనా ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తూ.. ప్రధాని మోడీ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటితోనూ, అమెరికా-రష్యా-ఉక్రెయిన్‌లతోనూ, పాశ్చాత్య దేశాలు-ఇరాన్‌లతోనూ సమతూక సంబంధాలు కొనసాగించారని పూనావాలా అన్నారు. ‘‘ఇది పాత నాన్ అలైన్‌మెంట్ విధానం కాదు.. ‘ఆల్ అలైన్‌మెంట్’ విధానం. ప్రపంచంలోని అన్ని వర్గాలతో భారత్ సమతూక సంబంధాలు కొనసాగిస్తోంది.’’ అని చెప్పారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఇజ్రాయెల్‌తో బలమైన సంబంధాలు పెంచలేదని పూనావాలా ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ విదేశాంగ విధానాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఉపయోగిస్తుంది. హమాస్‌కు పరోక్షంగా మద్దతు తెలిపేలా మాట్లాడుతుంది. కానీ ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఒక్కసారి కూడా స్పష్టంగా ఖండించలేదు.’’ అని విమర్శించారు. అంతేకాకుండా గాజా, రఫాలోని ముస్లింల పరిస్థితిపై కాంగ్రెస్ స్పందిస్తోందని.. కానీ ఢాకాలో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో మాత్రం మౌనం పాటిస్తోందని ఆరోపించారు.

సోనియా గాంధీ ఏమన్నారంటే?

తన వ్యాసంలో సోనియా గాంధీ.. భారత విదేశాంగ విధానం దేశ విలువలు, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న హింస, గాజాలో చిన్నారుల మరణాలపై భారత్ గళం విప్పాలని, ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తున్న అంతర్జాతీయ సమాజం వైఖరికి భారత్ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా కుటుంబాల నిర్బంధం, నిర్వాసితుల సమస్యలపై కూడా భారత్ స్పందించాలని సోనియాగాంధీ కోరారు. గతంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రియాంకాగాంధీ కూడా పాలస్తీనాకు మద్దతుగా హ్యాడ్ బ్యాగ్ ధరించి మద్దతు తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు కూడా పెట్టారు.