Reading Time: 3 minutes
Fih Pro League India Thrash Pakistan 7 1 In Dominant Hockey Victory

FIH Pro League: ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై ఘన విజయం సాధించింది. లండన్‌ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్‌ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు.

మ్యాచ్ ప్రారంభంలోనే ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. తొలి 90 సెకన్లలోనే భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్‌గా మలచలేకపోయింది. మరోవైపు 13వ నిమిషంలో పాకిస్థాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ అబూ బకర్ మహ్మద్ గోల్‌గా మార్చడంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో క్వార్టర్‌లో భారత్ ఆట తీరులో గేర్ మార్చింది.

20వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ కొట్టగా.. సుఖ్‌జీత్ సింగ్ చాకచక్యంగా డిఫ్లెక్ట్ చేసి గోల్ సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత 26వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుత డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలచి భారత్‌కు 2-1 ఆధిక్యం అందించాడు. హాఫ్‌టైమ్ తర్వాత భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గోల్స్ వర్షం కురిపించింది. పెనాల్టీ స్ట్రోక్‌ను హార్దిక్ సింగ్ గోల్‌గా మలచగా.. ఆ తర్వాత జుగ్‌రాజ్ సింగ్ అద్భుత గోల్‌తో స్కోరును 4-1కు చేర్చాడు.

41వ నిమిషంలో సుఖ్‌జీత్ అందించిన పాస్‌ను అభిషేక్ గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని 5-1కు పెంచాడు. ఆ తర్వాత రాజ్ కుమార్ పాల్ మరో గోల్ నమోదు చేశాడు. చివరి క్వార్టర్‌లో కూడా భారత దూకుడు కొనసాగడంతో 54వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించి భారత్ విజయాన్ని 7-1తో ఖరారు చేశాడు. భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, అభిషేక్, రాజ్ కుమార్ పాల్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో ఒక్కో గోల్ సాధించారు. మిడ్‌ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హార్దిక్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ పూర్తి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇదే టోర్నీలో జూన్ 23న కూడా పాకిస్థాన్‌పై 4-3 తేడాతో గెలిచిన భారత జట్టు, మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించింది.