
కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. పేలుడు జరిగిన ప్రాంతంలో పోలీసులు మరో పేలని పేలుడు పదార్థాన్ని గుర్తించి, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో సురక్షితంగా నిర్వీర్యం చేశారు. దీంతో వాహనంలో మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు విచారణ చేపట్టారు.అయితే ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ చేసిన సాహసంతో బాధిత మహిళ కారులోంచి ప్రాణాలతో బయటపడింది.
శనివారం(జూన్27) జోగిహళ్లి సమీపంలోని NH48పై జరిగిన ఈ ఘటనలో నిందితుడు 30 ఏళ్ల నాగేంద్ర మృతిచెందాడు. నిందితుడు తన మాజీ ప్రియురాలిని బెంగళూరులోని జయనగర్ నుంచి ఎల్లో బోర్డ్ ఉబెర్ క్యాబ్లో బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత విభేదాల కారణంగా ఆమె అతనితో సంబంధం తెంచుకుని ఫోన్ నంబర్ను కూడా బ్లాక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రయాణంలో నాగేంద్ర మహిళను తన వద్ద ఉన్న బాంబును చూపించి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. జోగిహళ్లి దగ్గర కదులుతున్న కారులోనే మహిళపై కత్తితో దాడి చేశాడు. పరిస్థితిని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ వెంటనే వాహనాన్ని ఆపడంతో, మహిళ కారు నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకుంది. కొద్ది క్షణాల్లోనే కారు భారీ పేలుడుతో మంటల్లో చిక్కుకోగా, నాగేంద్ర అందులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
►ALSO READ | సీఎం కాన్వాయ్ కోసం.. మోమోస్ అమ్మే యువతిపై ఇంత రాక్షసంగా దాడిచేయాలా?..సోషల్ మీడియాలో పెద్దచర్చ
గాయపడిన బాధితురాలు, డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు కారణంగా జాతీయ రహదారి-48పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.