
- చాహత్ బాజ్పాయ్ పూర్తిస్థాయి కమిషనర్గా 8 నెలలే
- 12 ఏండ్లలో 10 మంది కమిషనర్లు బదిలీ
- పాలనమీద పట్టువచ్చేలోపే ట్రాన్స్ఫర్
- గ్రేటర్ అభివృద్ధిపై ఎఫెక్ట్ చూపుతున్న ట్రాన్స్ఫర్లు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరోసారి ఏడాది లోపు బదిలీ అయ్యారు. సాధారణంగా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కమిషనర్లు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతరత్రా మేజర్ సమస్యలు తెలుసుకుని పాలనపై పట్టుసాధించడానికే ఐదారు నెలలు పడుతుంటుంది.
సదరు అధికారి పాలనపై పట్టు సాధించేలోపే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికొస్తోంది. గత 12 ఏండ్లలో 10 మంది కమిషనర్లు రెండేండ్ల పూర్తిచేయకుండానే బదిలీ అయ్యారు. అధికారుల ట్రాన్స్ఫర్లు గ్రేటర్ అభివృద్ధిపై ఎఫెక్ట్ చూపుతోంది.
ఒక్కరూ కూడా రెండేండ్లు పనిచేయలే
తెలంగాణ ఏర్పాటయ్యాక వరంగల్ బల్దియాలో ఏ ఒక్క ఆఫీసర్ కనీసం రెండేండ్లు పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఇప్పటివరకు 10 మంది కమిషనర్లు రాగా.. ఇందులో 9 మంది ఐఏఎస్, ఒకరు నాన్ ఐఏఎస్ కమిషనర్గా ఉన్నారు. మొదట్లో వచ్చిన సువర్ణ పాండాదాస్ 20 నెలల పాటు కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత సర్ఫరాజ్అహ్మద్ 21 నెలలు, శ్రుతి ఓజా 16 నెలలు, వీపీ గౌతమ్ 10 నెలలు, రవికిరణ్ (నాన్ ఐఏఎస్) 10 నెలలు, పమేలా సత్పతి 18 నెలలు, ప్రావీణ్య 20 నెలలు, అశ్విని తానాజీ వాఖడే 16 నెలలు పనిచేసి బదిలీ అయ్యారు.
ప్రస్తుత జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ 2025 జూన్ 13న బాధ్యతలు తీసుకోగా పూర్తిస్థాయి కమిషనర్గా కేవలం 8 నెలలు మాత్రమే పనిచేసి 2026 ఫిబ్రవరి 26న హనుమకొండ కలెక్టర్గా బదిలీ అయ్యారు. నాటి నుంచి గ్రేటర్ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వం ఆమెను శుక్రవారం చేపట్టిన బదిలీల్లో అదనపు బాధ్యతల నుంచి రిలీఫ్ చేశారు.
కొత్త కమిషనర్కు మేజర్ ప్రాజెక్టుల స్వాగతం
వరంగల్ కమిషనర్గా టి.వెంకన్న రానున్నారు. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కోర్ అర్బన్ రీజియన్ అండ్ మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మేజర్ ప్రాజెక్టులు స్వాగతం చెబుతున్నాయి. రూ.5,257 కోట్లతో చేపట్టే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.551 కోట్లతో చేపట్టే మంచినీటి సరఫరా ప్రాజెక్టులు పూర్తి చేయడం కొత్త కమిషనర్కు చాలెంజింగ్గా మారనున్నాయి. రాబోయే మూణ్నాలుగు నెలల్లో గ్రేటర్ ఎలక్షన్లు జరగనున్నాయి.
ఈక్రమంలో డివిజన్ల పెంపు ఉండే అవకాశం ఉంది. నేడోరేపో పూర్తిస్థాయి వానలు పడితే.. లోతట్టు ప్రాంతాల మునక, వరదల ప్రభావం ఉండనుంది. ఈ సమయంలో జీవీడబ్యూఎంసీ కమిషనర్ కీలకం. దీంతోపాటు ట్రైసిటీ, విలీన గ్రామాల్లో చెత్త సేకరణతో పాటు దోమల బెడద, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఎప్పటినుంచో తలనొప్పిగానే ఉంటోంది. కాగా, గ్రేటర్ వరంగల్లో ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టుల నిర్వహణ చేపడుతోంది కాబట్టే హెచ్ఎండీఏలో పనిచేసిన అనుభవం ఉన్న వెంకన్నను కమిషనర్గా తీసుకొస్తున్నట్లు
తెలుస్తోంది.
వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఓరుగల్లు బిడ్డ
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఓరుగల్లు బిడ్డనే రానున్నారు. హెచ్ఎండీఏ కోర్ అర్బన్ రీజియన్ మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్న టి.వెంకన్నను వరంగల్కు బదిలీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఇతని స్వస్థలం. కాగా, ఇన్నాళ్లు ఐఏఎస్ అధికారులను కమిషనర్లుగా నియమించిన ప్రభుత్వం.. ఈసారి మాత్రం గ్రూప్- 1 అధికారిని ఎంపిక చేసింది.