Reading Time: 2 minutes
వైభవ్ కోసం బకరాను సిద్ధం చేసిన గంభీర్.. బుడ్డోడి డెబ్యూ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Vaibhav Sooryavanshi Debut: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

సంజూ శాంసన్‌కు దక్కని కీపింగ్ బాధ్యతలు.. యువ సంచలనానికి లైన్ క్లియర్?

ప్రస్తుతం భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా నిలదొక్కుకోగా, ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఈ ముగ్గురూ ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. అయితే, ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్, రెండో మ్యాచ్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.

ఈ హఠాత్ పరిణామం వెనుక ఒక పెద్ద కారణం కనిపిస్తోంది. పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్‌ను రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పక్కన పెట్టే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్‌లలో శాంసన్ కేవలం 184 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ ఐదు పరుగులకే అవుట్ కావడంతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ కోసం గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్..!

రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026లో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్‌ను వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడికి గురిచేయకూడదని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. అందుకే అతనికి నేరుగా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకుండా, సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేలా సమయం ఇస్తున్నారు. ఇషాన్ కిషన్ రూపంలో బ్యాకప్ వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో, ఫామ్ కోల్పోయిన శాంసన్‌ను పక్కన పెట్టి వైభవ్‌కు తుది జట్టులో చోటు కల్పించడం జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు.

బెలఫాస్ట్‌లో భారత్ జోరు.. కోలుకుంటున్న ఐర్లాండ్..

జూన్ 28న బెలఫాస్ట్‌లో జరుగుతున్న ఈ నిర్ణయాత్మక సిరీస్ సమరంలో భారత ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా మరోసారి ఆరంభంలోనే వికెట్లు తీసి ఐర్లాండ్‌ను దెబ్బకొట్టారు. అరంగేట్రం చేసిన యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా ఐర్లాండ్ కెప్టెన్ లీన్ టక్కర్‌ను అవుట్ చేసి సత్తా చాటాడు. దీంతో హోస్ట్ టీమ్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే హ్యారీ టెక్టర్, బెన్ కాలిట్జ్ జోడీ నిలకడగా ఆడారు. మొత్తంగా ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకు 155 పరుగుల టార్గెట్ అందించింది.