
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 2-0తో కోల్పోయిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగింపు ప్రెజెంటేషన్లో మాట్లాడారు. ఈ సిరీస్ ఫలితం తమకు ఎంతమాత్రం ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఐర్లాండ్ ప్రదర్శనను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా రాణించిందని అయ్యర్ ఒప్పుకున్నారు.
ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనపై అయ్యర్ ప్రశంసలు..
శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “ఇది మాకు మంచి సిరీస్ కాదు, కానీ ఐర్లాండ్ జట్టు ఆడిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక్కడి పిచ్ ఎలా స్పందిస్తుందో వారికి ముందే పూర్తి అవగాహన ఉంది. దానికి తగ్గట్టుగానే వారు ప్రణాళికలు రచించుకున్నారు. మైదానంలో వారి ఫీల్డింగ్ ప్రదర్శన అత్యంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఐర్లాండ్ బౌలర్లు తమ వ్యూహాలను మైదానంలో అమలు చేసిన తీరు అమోఘం. బౌలింగ్ విభాగంలో వారు మమ్మల్ని పూర్తిగా అధిగమించారు అని ప్రశంసించారు.
యువ ఆటగాళ్లపై వ్యాఖ్యలు..
ఐపీఎల్ అనుభవం ఉన్న ప్రిన్స్ యాదవ్, అలాగే యువ ఆటగాడు సూర్యాన్ష్ షెడ్గేల గురించి అయ్యర్ ప్రస్తావిస్తూ.. “ప్రిన్స్ యాదవ్కు ఐపీఎల్లో ఆడిన మంచి అనుభవం ఉంది. అతను బౌలింగ్కు వచ్చేటప్పుడు తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు, సొంత ప్రణాళికలతో వస్తాడు. అలాగే సూర్యాన్ష్ కూడా మంచి ప్రణాళికలతో బరిలోకి దిగాడు” అని పేర్కొన్నారు. చివరగా ఐర్లాండ్ పర్యటనపై స్పందిస్తూ.. ఇక్కడికి రావడం, ఈ మైదానంలో ఆడటం తనకు దక్కిన గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నానని అయ్యర్ ముగించారు. ఈ సిరీస్లో భారత బ్యాటింగ్ వైఫల్యాలు స్పష్టంగా కనిపించగా, ప్రత్యర్థి జట్టు క్రమశిక్షణతో కూడిన ఆట తీరుతో సిరీస్ను కైవసం చేసుకుంది.