Reading Time: 2 minutes

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు.. కన్నీరు పెట్టుకున్న సీఎం విజయ్!

Caption of Image.

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.  తన విలక్షణమైన నటనతో, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను మెప్పించిన ‘చిత్ర బ్రహ్మ’ కే. భాగ్యరాజ్ (73) శనివారం  ( జూన్ 27, 2026) చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో  బాధపడుతున్న ఆయనను అపోలో ఆసుపత్రికి తరించారు.  వైద్యులు ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణవార్త సౌత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రముఖులు సంతాపం

భాగ్యరాజ్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ,  సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఆర్. మాధవన్ వంటి దిగ్గజాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్, రజనీకాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. తండ్రిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న నటుడు శంతనును, భాగ్యరాజ్ భార్య పూర్ణిమను విజయ్ హత్తుకుని ఓదార్చారు.

విజయ్ భావోద్వేగ పోస్ట్ 

భాగ్యరాజ్ కేవలం దర్శకుడు, నటుడు మాత్రమే కాదు… కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతంతో మాయ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎక్స్ వేదికగా విజయ్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు..గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలు, హ్యూమర్‌ను జోడించి ఆయన సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ సజీవం. ఆయన మరణం తమిళ సినిమాకు తీరని లోటు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో (State Honours) అంత్యక్రియలు నిర్వహిస్తాం అని ప్రకటించారు.

 

ఆయనొక ట్రెండ్ సెట్టర్..

తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ సుపరిచితులే. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి సూపర్ హిట్ సాధించాయి. ‘ముందానై ముడిచ్చు’, ‘చిన్నవీడు’ వంటి చిత్రాలు స్క్రీన్‌ప్లేకి నిఘంటువులు లాంటివి. అందుకే ఆయన్ను’ స్క్రీన్‌ప్లే కింగ్’ అని పిలుస్తారు. చెన్నైలోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. భాగ్యరాజ్ భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన సృష్టించిన అమరచిత్రాల రూపంలో సినీ ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయని అన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.