Reading Time: < 1 minute
గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. కాసేపటికే జిల్ జిల్ జిగేల్!

మల్లాపూర్, జూన్ 28 : మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఏకంగా 15 కిలోల బరువున్న చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక గంగపుత్ర మత్స్యకారుల కథనం ప్రకారం..

గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పెద్ద చెరువులో నీటి నిల్వలు అధికంగా ఉండటంతో చేపల పిల్లలను కొత్తగా వదలలేదని తెలిపారు. దీంతో ఇప్పటికే చెరువులో ఉన్న చేపలు సహజసిద్ధంగా పెరిగి 5 నుంచి 15 కిలోల వరకు బరువు పెరిగినట్లు చెప్పారు. ఆదివారం చేపల వేట కోసం వలలు వేయగా.. ఏకంగా15 కిలోల భారీ చేప చిక్కిందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎల్ల ఆశాలు, కార్యదర్శి న్యావనంది నికేశ్ తెలిపారు. భారీ చేపను చూసేందుకు స్థానికులు కూడా ఆసక్తి చూపించారు.

Fish

చెరువులో మరిన్ని భారీ చేపలు ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేప చిక్కడం అరుదైన విషయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు న్యావనంది నడిపి నర్సయ్య, ఎల్ల చిన్న దేవయ్య, గంగాధర్, సురేష్, పెద్దిరెడ్డి, గంగారాం, పల్లికొండ నర్సయ్య, లక్ష్మీనారాయణ, నవీన్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు దొరికిన భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.