
Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. బడా బడా రెస్టారెంట్లలోని కిచెన్లను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు సదరు యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
ప్రముఖ బిర్యానీ కేంద్రమైన గచ్చిబౌలి షా గౌస్ రెస్టారెంట్లో వంటగది అంతా ఈగలు ముసిరి, అత్యంత అపరిశుభ్రంగా దర్శనమిచ్చింది. కిచెన్ పరిసరాల్లో డ్రెయిన్లు తెరిచి ఉంచడం, కనీసం లేబుళ్లు కూడా లేని ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం నిర్వహించిన హైజీన్ రేటింగ్లో ఈ హోటల్ కేవలం 65 శాతం స్కోర్ మాత్రమే సాధించడంతో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అలాగే హైటెక్ సిటీలోని మెహ్ఫిల్ రెస్టారెంట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తడి నేలపైనే ఆహార వ్యర్థాలను పడేయడమే కాకుండా, ఒకపక్క భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే రూమాలీ రొట్టెలను తయారు చేస్తుండటం గమనార్హం. అక్కడి సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు కూడా లేకపోవడంతో, 67 శాతం స్కోర్ కేటాయించి మెహ్ఫిల్కు నోటీసులు జారీ చేశారు.
ఇక మాదాపూర్లోని ఐడియల్ కిచెన్లో తనిఖీలు చేసిన అధికారులకు ఫ్రీజర్లోని పిండివంటలపై బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. వంటకు వాడే మినప్పప్పులో పురుగులు ఉండటం చూసి అధికారులు షాకయ్యారు. ముడి పదార్థాల నిల్వలో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించి, 67 శాతం స్కోర్తో ఆ హోటల్కు నోటీసులు ఇచ్చారు. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్లో ఏకంగా లేబుల్ ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, గడువు ముగిసిన మష్రూమ్స్ (పుట్టగొడుగులు) వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో పాత ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. తుప్పు పట్టిన ఫ్రీజర్లు, ఈగలతో దారుణంగా ఉన్న వంటగదిని చూసి నివ్వెరపోయిన అధికారులు, కేవలం 60 శాతం స్కోర్ ఇస్తూ పాలమూరు గ్రిల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకునేది లేదని, నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.