
Anant Ambani Donates Rs 27.5 Crore to TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు.
టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేస్తామని అనంత్ అంబానీ వెల్లడించారు. ఈ బస్సులు తిరుమలలో భక్తులకు పర్యావరణహిత రవాణా సేవలను మరింత మెరుగుపర్చడంలో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా రిలయన్స్ సంస్థ సహకరించేందుకు అంగీకరించింది. దీంతో తిరుమలలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడనుంది.
ఇక పశు సంరక్షణకు సంబంధించి కూడా అనంత్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఆధునిక సదుపాయాలు, మెరుగైన సంరక్షణ, పశువైద్య సేవలతో గోశాలను అభివృద్ధి చేసే దిశగా టీటీడీతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ భారీ విరాళాలు, తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థతో పాటు గోశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన భక్తి భావంతో చేసిన ఈ సేవలు ప్రస్తుతం భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి.