
ఓటర్ల జాబితా సవరణ(సర్ )పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు.. ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదని..ఎందుకంటే… ఓటు గల్లంతైతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర నష్టమన్నారు జూపల్లి.
ఆదిలాబాద్లో జరిగిన బిఎల్ఓ (BLO) 2 కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన చేదు అనుభవాలు తెలంగాణలో ఏమాత్రం పునరావృతం కాకూడదన్నారు జూపల్లి. ముఖ్యంగా వలసదారులు, మైనార్టీల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఒక సవాల్గా తీసుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త ఇందులో భాగస్వామి కావాలి. బూత్ ఏజెంట్లు ముందంజలో ఉండి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయంగా ఎస్ఐఆర్ (SIR) మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలన్నారు.
నాయకులు, కార్యకర్తలు ఎవరూ నిరాశ నిస్పృహలకు లోనుకావద్దని జూపల్లి సూచించారు. పార్టీ కోసం కష్టపడి, నిబద్ధతతో పని చేసిన ప్రతి ఒక్కరికీ… పార్టీ పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ సముచిత ప్రాధాన్యత లభిస్తుందని భరోసా ఇచ్చారు.