
న్యూఢిల్లీ, వెలుగు: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. చైనాకు అవసరమైన ఎంట్రీ పర్మిట్, వీసాలు లేకుండా యాత్ర చేపట్టిన పలువురు భారతీయులు ప్రస్తుతం నేపాల్లో చిక్కుకుపోయినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. వారి నుంచి సహాయం కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయని వెల్లడించింది.
ప్రైవేట్ ట్రావెల్స్ ఇచ్చే హామీలను నమ్మి, పత్రాలు తర్వాత వస్తాయనే అంచనాతో ప్రయాణం మొదలుపెట్టవద్దని హెచ్చరించింది. చైనా వీసా, ఎంట్రీ పర్మిట్తో పాటు అవసరమైన అన్ని అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్లు చేతికి వచ్చిన తర్వాతే ప్రయాణాన్ని ప్రారంభించాలని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వెళ్తే మార్గమధ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులు ప్రైవేట్ ఆపరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని అధికారిక అనుమతులు పొందిన తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.