
హైదరాబాద్ సిటీ, వెలుగు: భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాల్లో పారబోస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం తన ఆఫీసులో కాంట్రాక్టర్లు, బిల్డర్లు, భవన నిర్మాణ కూల్చివేత వ్యర్థాల ప్రాసెసింగ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. వ్యర్థాలను తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన ప్రాసెసింగ్ ప్లాంట్లకే తరలించాలని ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వాహనదారులపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధిక లోడ్తో రవాణా చేసినా, అక్రమంగా డంపింగ్ చేసినా మొదటిసారి రూ. 25 వేల జరిమానా, రెండోసారి రూ. 50 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. మూడోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.