Reading Time: 2 minutes
Sudan Civil War Rsf Surrounds Al Obeid Un Genocide Warning

Sudan Civil War: ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) తీవ్ర అంతర్యుద్ధంతో రక్తసిక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశంలో, ఇప్పుడు మరో ఘోర మారణహోమం జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి (UN), అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. సూడాన్ సైన్యానికి, పారామిలటరీ దళమైన ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (RSF) కి మధ్య జరుగుతున్న ఈ పోరులో.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘అల్-ఓబెద్’ నగరం ఇప్పుడు డెత్ జోన్‌గా మారే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నాయి.

72 గంటల్లో భారీ దాడికి RSF వ్యూహం..

నోర్త్ కోర్డోఫాన్ రాజధాని అయిన అల్-ఓబెద్ నగరాన్ని ఆర్ఎస్ఎఫ్ బలగాలు మూడు వైపుల నుంచి (ఉత్తరం, పడమర, దక్షిణం) చుట్టుముట్టాయి. ఇప్పటికే జరిగిన డ్రోన్ దాడుల్లో ఐదు భారీ ఆయిల్ ట్యాంక్ ఫామ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాబోయే 72 గంటల్లో ఈ నగరంపై RSF తుది దాడికి దిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుడాన్ అధికారిక ఆర్మీ (SAF) వైమానిక దాడులతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, RSF ముట్టడి తీవ్రరూపం దాలుస్తోంది.

అల్-ఓబెద్ నగరం ఎందుకు కీలకం అంటే..

సుడాన్ మధ్య భాగంలో ఉన్న అల్-ఓబెద్ నగరం భౌగోళికంగా, ఆర్థికంగా అత్యంత ప్రాధాన్యత కలిగినది. పశ్చిమ దార్ఫుర్ ప్రాంతాన్ని తూర్పు ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన హైవే ఈ నగరం గుండానే వెళుతుంది. దేశానికి కీలకమైన ఆయిల్ పైప్‌లైన్లు ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. ఒకవేళ ఈ నగరం RSF వశమైతే, రాజధాని ఖార్తూమ్ తర్వాత వారు సాధించే అతిపెద్ద ప్రాంతీయ విజయం ఇదే అవుతుందని చెబుతున్నారు. దీనితో పశ్చిమ సుడాన్ మొత్తం వారి గుప్పిట్లోకి వెళ్తుందని అంటున్నారు. నిజానికి గతంలో జరిగిన దారుణాలే ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వణుకు పుట్టిస్తున్నాయి. అక్టోబర్ 2025లో ‘అల్-ఫాషర్’ నగరాన్ని RSF హస్తగతం చేసుకున్నప్పుడు అక్కడ క్రూరమైన నరమేధం జరిగింది. ఆ సమయంలో అల్-ఫాషర్‌లో జాగ్వా, ఫుర్ తెగలను లక్ష్యంగా చేసుకుని RSF సామూహిక అత్యాచారాలు, దాడులు, బలవంతపు అదృశ్యాలకు పాల్పడింది. ఒక జాతిని నిర్మూలించేలా 18 నెలల పాటు అక్కడ ఆంక్షలు విధించారు. ఇప్పుడు అల్-ఓబెద్ నగరంలోనూ అదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే దాడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ చేస్తోంది.

ఏప్రిల్ 2023లో అధికారం కోసం మొదలైన ఈ పోరు దేశాన్ని సర్వనాశనం చేసింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, 1.4 కోట్ల మందికి పైగా ఇళ్లు వదిలి పారిపోయారు. దేశంలో దాదాపు 3.3 కోట్ల మందికి అత్యవసర మానవీయ సహాయం (ఆహారం, మందులు) అవసరముంది. ఆకలి, అంటువ్యాధులు, లైంగిక హింస ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పాఠశాలలు, ఆసుపత్రులు పూర్తిగా మూతపడ్డాయి. లక్షలాది మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతటి ఘోర విపత్తు జరుగుతున్నా, ప్రపంచ మీడియాలో సుడాన్ సంక్షోభానికి కేవలం 1 శాతం మాత్రమే కవరేజ్ లభిస్తోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల యుద్ధాలపై ఉన్న శ్రద్ధ సుడాన్‌పై లేదని, కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ప్రపంచ దేశాలు వెంటనే జోక్యం చేసుకుని శాంతి చర్చలు జరపాలని, నిందితులను శిక్షించాలని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి. లేదంటే, అల్-ఓబెద్ నగరం మరో భారీ శ్మశాన వాటికగా మారడం ఖాయంగా కనిపిస్తోందని వాపోతున్నాయి.