Reading Time: 2 minutes
Venezuela Earthquake Mother Sacrifices Life To Save Baby Emotional Story

Venezuela: వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసంలో తన ప్రాణాలను పణంగా పెట్టి కన్నకూతురిని కాపాడుకున్న ఒక తల్లి కథ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ‘మారిటిమో డి లా గ్వైరా’ (Marítimo de La Guaira) ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో, జూన్ 24న సంభవించిన ఈ ఘోర విపత్తులో తమ ఇల్లు కూలిపోతుండగా.. తన ఏడాది వయసున్న కుమార్తె అలానా (Alana) పై బోర్లా పడి, శిథిలాలు పాపపై పడకుండా అడ్డుగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఆండ్రియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె కడుపున పుట్టిన ఆ పసిపాప మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.

ఈ హృదయవిదారక ఘటనపై హెక్టర్ బెల్లో భూకంపం జరిగిన రెండు రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. తన భార్యను ఓ రియల్ హీరోగా అభివర్ణిస్తూ.. “నువ్వు ఎప్పటికీ మా అభిమాన కథానాయికవే మమ్మీ. నువ్వు ఎంత అద్భుతమైనదానివో, నీ కూతురిని ఎంతగా ప్రేమించావో మన పాపకు ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాను. నీ చివరి శ్వాస వరకు మన కూతురిని వదలకుండా, నీ ప్రాణాలనే అర్పించి ఆమెను ఎలా కాపాడావో ఆ ధైర్య సాహసాల కథను నేను ఆమెకు చెప్తాను” అని అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చాడు. వెనిజులా ఫుట్‌బాల్ మీడియా సంస్థ కుమనా డి కాంపెయోన్స్ (Cumaná de Campeones) కూడా ఆండ్రియా మృతదేహం వారు నివసించే కూలిపోయిన భవన శిథిలాల కింద లభ్యమైందని, చిన్నారి అలానా ఆ భవనం కూలినప్పటికీ క్షేమంగా బ్రతికి బయటపడిందని స్పష్టం చేసింది.

మరొక పోస్ట్‌లో హెక్టర్ తన కుమార్తెను ఉద్దేశించి.. “నా బంగారు తల్లీ.. నువ్వు బలంగా ఉండాలి. ముక్కలైన నా హృదయాన్ని నయం చేయడానికి నీకంటూ నేనున్నాను. ఇప్పుడు నువ్వు, నేను, ఆకాశం నుంచి మనల్ని చూసుకునే నీ మమ్మీ మాత్రమే ఉన్నాం. నీ మమ్మీయే నాకు ఈ బాధను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ బాధలో కూడా నాకు ఒకటి తెలుసు.. నీ మమ్మీకి గనుక నాతో మాట్లాడటానికి ఒక్క నిమిషం సమయం దొరికితే.. తను ప్రాణమిచ్చి నిన్ను కాపాడినట్లే, నన్ను కూడా నా ప్రాణం పెట్టి నిన్ను కాపాడమని చెప్తుంది” అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

వందేళ్లలోనే అత్యంత ఘోరమైన విపత్తు..
యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. వెనిజులాలో కొన్ని క్షణాల వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన ఈ జంట భూకంపాలు గడిచిన వందేళ్లలోనే ఆ దేశ చరిత్రలో అత్యంత బలమైనవిగా నమోదయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇప్పటివరకు కనీసం 920 మందికి పైగా మరణించగా, 3,300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేలాది భవనాలు నేలమట్టం కావడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు, అత్యవసర సిబ్బంది అక్కడ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దశాబ్ద కాలంలో వెనిజులా చూసిన అత్యంత భయంకరమైన ఈ విపత్తులో ఆండ్రియా చేసిన త్యాగం ఒక తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిపోతుంది.