
ముంబై: రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై మహారాష్ట్ర రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు సమగ్ర విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం (జూన్ 27) ఆదేశాలు జారీ చేశారు. థానే జాయింట్ సీపీ పంజాబ్రావ్ ఉగలే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విచారించనుంది.
మరోవైపు.. సీఎం ఫడ్నవీస్ టెట్ క్వశ్చన్ పేపర్ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే, డీజీపీ సదానంద్ డేట్లతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని.. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అసలేం జరిగిందంటే..?
2026, జూన్ 28 (ఆదివారం) మహారాష్ట్రలో టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావటం, ఆందోళనలు మొదలవటంతో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ పరీక్ష కోసం వెయ్యి 28 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పరీక్షకు ఒకరోజు ముందు క్వశ్చన్ పేపర్ లీకైనట్లు అధికారిక వర్గాల సమాచారం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రైడ్ చేసిన బివండీ పోలీసులు.. TET 2026 పరీక్ష పేపర్లకు సంబంధించిన సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పరీక్షకు 24 గంటల ముందే టెట్ పేపర్లు థానే ఏరియాలో సర్కిలేట్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో కౌన్సిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రైడ్స్ నిర్వహించి సీల్డ్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మొత్తం 4.28 లక్షల మంది హాజరవుతున్న టెట్ పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.
టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు భివండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రశ్నపత్రం కాపీలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బీహార్, హర్యానాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
పేపర్ లీకేజ్పై కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు విమర్శలకు దిగారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని.. మహారాష్ట్రలో ఫడ్నవీస్ నేతృత్వంలతోని బీజేపీ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు.