
ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ భారత్ ఘోర పరాజయం పాలవడంపై మాజీ ఓపెనర్ సదాగోపన్ రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ సిరీస్ను చాలా తేలికగా తీసుకుందని, ఆటగాళ్లు దీనిని ఒక ‘పిక్నిక్ టూర్’లా భావించారని ఆయన విమర్శించారు. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్పైనే దృష్టి పెట్టి, ఐర్లాండ్ను తక్కువ అంచనా వేయడం వల్లే ఈ పరాభవం ఎదురైందని, ఐర్లాండ్ జట్టు భారత్కు సరైన గుణపాఠం చెప్పిందని ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు.
అతివిశ్వాసమే ముంచేసింది..
భారత జట్టుకు అతివిశ్వాసం అసలు మంచిది కాదని, దాని వల్లే ఈ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని రమేష్ విశ్లేషించారు. ఈ ఐర్లాండ్ సిరీస్ మొదట అనుకున్న షెడ్యూల్లో లేదు. ఇంగ్లాండ్ ప్రధాన సిరీస్ అయితే, ఇది కేవలం ఒక పికిల్ లాంటిదని, అయితే భారత్ ఆ ఘాటును తట్టుకోలేకపోయిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత, భారత ఆటగాళ్లు మూడు నెలల పాటు ఐపీఎల్లో ఆడారు. ఇలా వరుసగా నాలుగు నెలలు టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉండి కూడా, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం నమ్మశక్యం కాని విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏనుగు కూడా ఒక్కోసారి అడుగు తడబడుతుంది కానీ, ఐర్లాండ్ లాంటి జట్టుపై ఇలా జరగడం ఘోరమైన విషయమన్నారు.
రెండో టీ20పైనే సర్వత్రా ఆసక్తి..
మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి, 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. హర్షిత్ రాణా (3 వికెట్లు), అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49) మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం (జూన్ 28) జరగబోయే రెండో టీ20 మ్యాచ్ భారత్కు అత్యంత కీలకంగా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ కెరీర్లో తొలి టీ20 సిరీస్ పరాజయాన్ని తప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.