
Bharat Taxi Launch: దేశీయ రవాణా రంగంలో సరికొత్త సహకార విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి కో-ఆపరేటివ్ మోడల్ డ్రైవర్-ఓనర్షిప్ రైడ్-హెయిలింగ్ సర్వీస్ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం గుజరాత్లో అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతగా గుజరాత్లోని 14 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఓలా, ఉబర్లకు చెక్.. డ్రైవర్లే యజమానులు
అమిత్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా, డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా ఈ ‘భారత్ టాక్సీ’ ప్లాట్ఫారమ్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ‘జీరో కమిషన్ మోడల్’ అని చెప్పారు. ఇందులో డ్రైవర్లు కంపెనీకి ఎలాంటి కమిషన్ కట్టాల్సిన అవసరం లేదని, ప్రయాణికుల నుంచి వచ్చే పూర్తి కిరాయి మొత్తం నేరుగా డ్రైవర్లకే దక్కుతుందన్నారు. ఈ వ్యవస్థలో డ్రైవర్లు కేవలం పని వాళ్లు మాత్రమే కాదని, ఈ ప్లాట్ఫారమ్కు సహ-యజమానులు అని, వారిని కేంద్ర ప్రభుత్వం ‘సారథులు’ అని పిలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలకు విస్తరణ
గుజరాత్ తర్వాత ఈ ప్రాజెక్ట్ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేంద్రం భారీ స్కెచ్ వేసింది. రాబోయే రెండేళ్లలో ముంబై, పూణే, నాగపూర్, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు 500కు పైగా నగరాలను ఈ నెట్వర్క్తో అనుసంధానించనున్నామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా డ్రైవర్లు కేవలం 100 రూపాయల షేర్ కొనుగోలు చేసి ఈ భారత్ టాక్సీలో భాగస్వాములుగా మారడం విశేషం. ఈ సహకార నమూనా ద్వారా అటు ప్రయాణికులకు సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సౌకర్యం లభించడంతో పాటు, ఇటు డ్రైవర్లకు గౌరవం, ఆర్థిక భద్రత చేకూరుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్లాట్ఫారమ్తో అనుసంధానమైన డైవర్లకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తక్కువ వడ్డీకే రుణాలు, ఉచిత బీమా రక్షణ, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు.