
Sourav Ganguly another dig at Greg Chappell: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి భారత మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఒకసారి మాత్రమే చాపెల్ను నమ్మానని, రెండోసారి ఆ తప్పు చేయనని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విభేదాల కారణంగానే చాపెల్ పంపిన ఈ-మెయిల్కు కూడా తాను స్పందించలేదని వెల్లడించారు. అలాగే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సంక్షేమం కోసం పాకిస్థాన్ ప్రభుత్వానికి పంపిన పిటిషన్పై సంతకం చేయాలంటూ చాపెల్ చేసిన అభ్యర్థనను కూడా తాను పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం దాదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సిరలు అయ్యాయి.
సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పద అధ్యాయంగా నిలిచాయి. 2005లో గంగూలీ మద్దతుతోనే చాపెల్ భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. అయితే కొద్ది కాలానికే ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. గంగూలీ కెప్టెన్గా కొనసాగేందుకు మానసికంగా, శారీరకంగా తగిన స్థితిలో లేడంటూ చాపెల్ బీసీసీఐకి లేఖ రాశాడనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అనంతరం గంగూలీ కెప్టెన్సీ కోల్పోగా, రాహుల్ ద్రవిడ్ భారత జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కొంతకాలం గంగూలీ జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. మరోవైపు 2007 ప్రపంచకప్లో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో చాపెల్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. ‘చాపెల్ నాకు ఈ-మెయిల్ పంపినా నేను స్పందించలేదు. నిజాయితీ లేని వ్యక్తులతో నేను మాట్లాడను. ఎవరి గురించి అయినా అభిప్రాయం ఉండొచ్చు. ఓ ఆటగాడు బాగోలేదని నేరుగా చెప్పొచ్చు. కానీ సమస్యలను తప్పు మార్గంలో పరిష్కరించేందుకు ప్రయత్నించే వారిని నేను ఇష్టపడను. నా ముఖం మీదే నువ్వు సరిపోవడం లేదని చెప్పేవారిని మాత్రం గౌరవిస్తాను’ అని చెప్పారు. అంతేకాకుండా 2011లో కూడా చాపెల్ తనను సంప్రదించాడని దాదా వెల్లడించారు. అప్పట్లో తాను కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉండగా.. జట్టుకు హెడ్ కోచ్గా రావాలని చాపెల్ ఆసక్తి చూపుతూ తనకు ఈ-మెయిల్ పంపాడని తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించినట్లు వెల్లడించారు.
‘2011లో కేకేఆర్కు కోచ్గా రావాలని చాపెల్ నన్ను సంప్రదించాడు. నేను కెప్టెన్గా ఉండగా అతను కోచ్గా రావాలనుకున్నాడు. అది నిజంగా అద్భుతమైన ఆలోచనే (వ్యంగ్యంగా). వాళ్లు దాదా మళ్లీ మోసపోతాడని అనుకుని ఉంటారు. కానీ నేను ఒకసారి మాత్రమే మూర్ఖుడిని అవుతాను, రెండోసారి కాదు’ అని గంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా చాపెల్తో తనకు జరిగిన అనుభవాలను గంగూలీ ఇంకా మరిచిపోలేదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.