
KTR: “మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా అదే జరుగుతోంది” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు జ్వరం ఉన్నప్పటికీ వికారాబాద్ కార్యకర్తలను కలవడానికి వచ్చానని, ఇక్కడి అద్భుతమైన ప్రకృతి, గాలి పీల్చుకుంటే ఉన్న రోగాలన్నీ నయమైపోతాయని అన్నారు. వికారాబాద్ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రమని, ఇక్కడి నీరు, గాలి అన్నీ ఔషధాలతో సమానమని కొనియాడారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్పీకర్ అలా మాట్లాడటం తగదు
కేసీఆర్ అప్పులు చేసి పోయాడంటూ శాసనసభ స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఇలాంటి రాజకీయ మాటలు మాట్లాడితే ఆయన గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వమే లెక్కలతో సహా బయటపెట్టిందని గుర్తుచేశారు. కేసీఆర్ అప్పులు చేసినా.. వాటి ద్వారా ప్రజలకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, పెరిగిన పింఛన్లు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వంటి అనేక సంక్షేమ ఫలాలను అందించిన మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. చీకట్లో ఉన్న తెలంగాణను కేసీఆర్ వెలుగుల్లోకి తెస్తే.. ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు, యూరియా కొరత మొదలైందని మండిపడ్డారు.
హామీలు ఏమయ్యాయి? ఖేల్ ఖతం కావడం ఖాయం
రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులు, కూలీలకు ఆర్థిక సాయం అందిస్తామని దొంగ మాటలు, దగుల్బాజీ ముచ్చట్లు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. “రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది.. మేమేమైనా దివానాగాళ్లమా అని ఎన్నికల ముందు అడిగారు.. మరి ఇప్పుడు వారిని ఏమని పిలవాలి?” అని నిలదీశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు దాటినా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తొందరలోనే ఈ ప్రభుత్వ దుకాణం బంద్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అలాగే, తమ నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెడితే వాళ్లు అంత పెద్ద లీడర్లు అవుతారని స్పష్టం చేశారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులకు హెచ్చరిక.. దామగుండం అడవుల నరికివేతపై ఆగ్రహం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ డ్యూటీ తాము చేయాలని, అంతేకాని అధికార పార్టీకి తొత్తులుగా మారి అతి చేయవద్దని కేటీఆర్ హెచ్చరించారు. రేపు తాము అధికారంలోకి వచ్చాక.. అతి చేసిన అధికారులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, మిత్తితో (వడ్డీతో) కలిపి చెల్లిస్తామని స్పష్టం చేశారు.
దామగుండం అడవుల పరిరక్షణపై మాట్లాడుతూ.. నాడు నేవీ రాడార్ కేంద్రం కోసం కేసీఆర్ భూములు ఇవ్వలేదని, ఎందుకంటే అక్కడ 12 లక్షల చెట్లు నరికివేయాల్సి వస్తుందని పర్యావరణాన్ని కాపాడారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోడీ అంటే భయమని, అందుకే కేంద్రం అడిగిన వెంటనే 2900 ఎకరాల అడవిని అప్పగించేశారని ఆరోపించారు. ఒకవైపు మూసీని బాగు చేస్తామని చెప్తూ.. మరోవైపు మూసీ పురిటిగడ్డ అయిన వికారాబాద్ అనంతగిరి కొండల్లో చెట్లను కొట్టేస్తున్నారని, బీజేపీ-కాంగ్రెస్ ఇద్దరూ కలిసి మూసీకి ఉరివేస్తున్నారని మండిపడ్డారు.
స్పీకర్ దృతరాష్ట్రుడయ్యాడు.. రేవంత్ కుటుంబం భూముల దోపిడీ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ పరిధిలోని 10 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో కేసీఆర్ 90 శాతం పనులు పూర్తి చేశారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అభివృద్ధిని ఆపేశారన్నారు. ఇక ఫిరాయింపులపై స్పందిస్తూ.. “అసెంబ్లీ స్పీకర్ ఇప్పుడు దృతరాష్ట్రుడిలా మారారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ కండువాలు కప్పుకుని ప్రచారం చేస్తున్నా ఆయనకు కనిపించడం లేదట” అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో భూములను మింగేస్తున్నారని ఆరోపిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.