
HYDRAA: హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడితే చాలు రోడ్లు జలమయం కావడానికి, వరద నీరు నిలిచిపోవడానికి గల అసలు కారణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని వరద, మురుగు కాలువల్లో లారీల కొద్దీ చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA) నగరవ్యాప్తంగా నాలాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నాలాలు, బాక్స్ డ్రైన్ల నుంచి కేవలం సాధారణ మురికినే కాకుండా.. ఏకంగా పరుపులు, సోఫాలు, కుర్చీలు, టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, కేబుల్ వైర్లను తొలగిస్తూ హైడ్రా సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమం కోసం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఇరిగేషన్, పోలీస్ శాఖల సహకారంతో హైడ్రా ముమ్మర చర్యలు చేపట్టింది. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హైడ్రా డిఆర్ఎఫ్ (DRF), మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 X 7 అందుబాటులో ఉంటూ నిరంతరాయంగా చెత్తను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఆఘాపురా నాలా వద్ద గత ఆరు రోజులుగా పూడికతీత పనులు నాన్స్టాప్గా కొనసాగుతున్నాయి. ఈ ఒక్క నాలా నుంచే ఇప్పటివరకు ఏకంగా 13 టిప్పర్ల చెత్తను హైడ్రా సిబ్బంది వెలికితీయడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మియాపూర్ – పటాన్చెరు ప్రధాన మార్గంలోని బాక్స్ డ్రైన్లో భారీగా పేరుకుపోయిన కేబుల్ వైర్ల వ్యర్థాలు బయటపడ్డాయి. అలాగే చందానగర్, లింగంపల్లి ఆర్యూబీ (RUB) వద్ద ఉన్న బాక్స్ డ్రైన్ నుంచి రెండు ట్రక్కుల నిండా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలనే అధికారులు తొలగించారు. కృష్ణానగర్ బాక్స్ డ్రైన్లో అయితే ఏకంగా 7 అడుగుల మేర పూడిక పేరుకుపోగా, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా బృందాలు దాన్ని పూర్తిగా క్లియర్ చేశాయి. ఈ మురుగు కాలువలు, నాలాలు అనేవి కేవలం వరద నీరు సజావుగా సాగిపోవడానికేనని.. కాబట్టి ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి కాలువల్లో ఇలాంటి చెత్తాచెదారం వేయవద్దని, నగరాన్ని కాపాడుకోవడంలో సహకరించాలని హైడ్రా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.