Reading Time: < 1 minute
India Vs Ireland T20 Shreyas Iyer Post Match Comments

ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్.. ఈ ఓటమి ఒక గొప్ప అనుభవమని, దీని నుండి జట్టు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో లయ తప్పడమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు.

“తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం మంచి ప్రారంభమే అయినప్పటికీ.. ఫలితం నిరాశపరిచింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. పిచ్ నుండి లభించిన స్వింగ్‌ను వాడుకుంటూ వికెట్లు తీశారు. మాకు అద్భుతమైన స్టార్ట్ దక్కింది. కానీ, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా విఫలమయ్యాం. ఇక్కడి గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవని తెలిసినప్పటికీ.. ఐర్లాండ్ బ్యాటర్లు స్ట్రెయిట్ షాట్లు ఆడేలా బంతులు వేశాం. ప్రత్యర్థికి లభించిన మంచి ఆరంభాన్ని బట్టి చూస్తే.. వారిని 140 పరుగులకే కట్టడి చేసి ఉంటే చేజ్ చేయడం సులువయ్యేది” అని అయ్యర్ విశ్లేషించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత జట్టు బరిలోకి దిగడం వల్ల ఆటగాళ్లలో లయ తప్పినట్లు అనిపించిందని, అయితే దీనిని ఒక సాకుగా చెప్పలేమని అన్నాడు. “క్రికెట్‌లో దేనినీ తేలికగా తీసుకోకూడదు. కేవలం మైదానంలోకి అడుగుపెట్టగానే మ్యాచ్‌లు గెలవలేం. ప్రతి క్షణం కష్టపడాలి, ప్రెజెంట్ లో బతకాలి. ప్రత్యర్థిని దెబ్బతీసే అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదలకూడదు. ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం” అని అయ్యర్ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో గాయం నుండి కోలుకుని అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా, డొమెస్టిక్ సర్క్యూట్ నుండి తనకు బాగా తెలిసిన శివమ్ దూబే ప్రదర్శనలను అయ్యర్ అభినందించాడు. ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పులను వీలైనంత త్వరగా మర్చిపోయి.. తదుపరి మ్యాచ్‌లో పూర్తి బలంతో, సరికొత్త వ్యూహాలతో పునరాగమనం చేస్తామని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.