
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రటిక్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డెమోక్రటిక్ పార్టీ క్రమంగా కమ్యూనిస్టు భావజాలం వైపు వెళ్తోందని ఆరోపించారు. రాబోయే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మతపరమైన సంప్రదాయవాదులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ప్రోగ్రెసివ్ నాయకత్వం అమెరికా విలువలు, క్రైస్తవ మతం, దేశ భవిష్యత్తుకు ముప్పుగా మారుతోందని వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్లో జరిగిన ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ కోయలిషన్ వార్షిక ‘రోడ్ టు మెజారిటీ’ సదస్సులో శుక్రవారం ప్రసంగించిన ట్రంప్.. ఇటీవల న్యూయార్క్ నగరంలో డెమోక్రటిక్ సోషలిస్టుల మద్దతుతో గెలిచిన అభ్యర్థులను ప్రస్తావించారు. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి లభిస్తున్న మద్దతు డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర వామపక్ష భావజాలం పెరుగుతోందనడానికి నిదర్శనమని అన్నారు. “డెమోక్రటిక్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇది న్యూయార్క్తో ఆగిపోదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మతపరమైన వర్గాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్ర వామపక్షాలు అమెరికా సమాజాన్ని పూర్తిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. “పిల్లలపై ట్రాన్స్జెండర్ శస్త్రచికిత్సలను మళ్లీ ప్రోత్సహించాలని చూస్తున్నారు. క్రైస్తవులు, చర్చిలపై మళ్లీ యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్లో ఎన్నికైన కమ్యూనిస్టులు సంప్రదాయ అమెరికన్ జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
కమ్యూనిజంపై ఘాటు వ్యాఖ్యలు
కమ్యూనిస్టు సిద్ధాంతం చివరకు దేశాలను నాశనం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. “కమ్యూనిజాన్ని ప్రజలకు అమ్మడం చాలా సులభం. కానీ అది అన్నింటినీ నాశనం చేస్తుంది. నేను కమ్యూనిస్టు అయితే ఉచిత ఇళ్లు, ఉచిత అద్దె, ఉచిత ఆహారం ఇస్తానని చెబుతాను. కానీ చివరికి ప్రజలందరూ బాధపడతారు లేదా చనిపోతారు. అదే కమ్యూనిజం ఫలితం” అని విమర్శించారు. కమ్యూనిస్టు భావజాలంలో రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయడం కూడా భాగమేనని ట్రంప్ ఆరోపించారు. తమను వ్యతిరేకించే వారిని హత్య చేయడం వారి సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం అని.. వాళ్లు చాలా క్రూరమైనవారని వ్యాఖ్యానించారు.
డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం తమ పార్టీలో పెరుగుతున్న తీవ్ర వామపక్ష భావజాలాన్ని అడ్డుకునే స్థితిలో లేదని ట్రంప్ విమర్శించారు. “వాళ్లు తెలివిగా కూడా లేరు, ధైర్యంగా కూడా లేరు. తమ కళ్ల ముందే జరుగుతున్న ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోతున్నారు. డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు సోషియల్ డెమోక్రటిక్ పార్టీ కాదు… పూర్తిస్థాయి కమ్యూనిస్టు పార్టీగా మారుతోంది” అని ఆరోపించారు. మతపరమైన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ట్రంప్ కమ్యూనిజం, మత స్వేచ్ఛ గురించి కూడా వ్యాఖ్యానించారు. “కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు. వారు అన్ని మతాలపై దాడి చేస్తారు. ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. కమ్యూనిస్టులు అమెరికాలో అధికారంలోకి వస్తే చర్చిలు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.
అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. డెమోక్రటిక్ పార్టీపై తీవ్ర విమర్శలతో పాటు మతపరమైన ఓటర్లను తనవైపు ఆకర్షించే ప్రయత్నంగా ఆయన ప్రసంగాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.