Reading Time: 2 minutes
Gautam Gambhir Faces Criticism After Indias 0 2 T20 Series Loss To Ireland Iceland Cricket Trolls

Iceland Cricket Mocks Gautam Gambhir After India Series Loss to Ireland: టీ20 ప్రపంచ ఛాంపియన్‌ భారత్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. అత్యంత చెత్త ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోవడంతో జట్టు ఎంపిక, కెప్టెన్సీ నిర్ణయాలు, వ్యూహాలపై.. అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం, జట్టు కూర్పులో చేసిన మార్పులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్:

భారత్ వరుస పరాజయాల నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యంగా స్పందించింది. ‘గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకోవాలనే ఆసక్తి మాకు లేదు. అయితే అతనికి అద్భుత ప్రతిభ మాత్రం ఉంది. టాప్ క్లాస్ భారత జట్టుతో ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలు సాధించడం నిజంగా అసాధారణమైన ప్రతిభ’ అంటూ సెటైరికల్ పోస్ట్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు:

మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం విశ్లేషణాత్మకంగా స్పందించాడు. గౌతమ్ గంభీర్ జట్టులో ఆల్‌రౌండర్లపై అధికంగా ఆధారపడుతున్నారని, భారత్‌కు అత్యవసరంగా ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని అభిప్రాయపడ్డాడు. ‘ఇంతకుముందు ఆల్‌రౌండర్లు తక్కువగా ఉండేవారు. గంభీర్ హయాంలో ఆల్‌రౌండర్లు మరీ ఎక్కువైపోయారు. భారత జట్టుకు వెంటనే ఒక ప్యూర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం’ అని మంజ్రేకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

గిల్‌ను మళ్లీ టీ20ల్లోకి తీసుకురావాలి:

మ్యాచ్ అనంతరం జరిగిన చర్చలో మంజ్రేకర్ మరో కీలక అభిప్రాయం వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్‌లపై భారత బ్యాటర్లకు టెక్నిక్ కొరవడుతోందని, అలాంటి పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ వంటి బ్యాటర్లు జట్టుకు ఎంతో ఉపయోగపడతారని చెప్పాడు. ‘గిల్ ఇప్పటికే టీ20ల్లో తన సామర్థ్యాన్ని నిరూపించాడు. ఐపీఎల్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్సీ గురించి కాదు కానీ ఇలాంటి విదేశీ పరిస్థితుల్లో ఆడగల బ్యాటర్లను క్రమంగా మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావాలి. ఇంగ్లాండ్, ఇతర విదేశీ పిచ్‌లపై అతని టెక్నిక్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. అది వెంటనే జరగకపోయినా, భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు పడతాయి’ అని మంజ్రేకర్ వివరించాడు.

ఇక ఇంగ్లాండ్ సిరీస్‌పై ఫోకస్:

ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు ఇప్పుడు పూర్తిగా ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తిరిగి విజయాల బాట పట్టాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు గౌతమ్ గంభీర్, జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలకు ఈ సిరీస్‌లోని ప్రదర్శనే సరైన సమాధానం అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.