
నిర్మల్, వెలుగు: అత్యుత్తమ పనితీరు కనబరిచి మహిళలకు చేరువై, భరోసా కల్పించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ రాష్ట్రస్థాయిలో టాప్లో నిలిచిందని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలోని భరోసా కార్యాలయాన్ని సందర్శించి షీ టీమ్ ఎస్సై నరసయ్యతోపాటు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలందరికీ షీ టీం పోలీస్ బృందం అండగా నిలిచిందన్నారు.
పోలీస్ స్టేషన్ల వారీగా షీటీమ్ బృందాలు మహిళల సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కారానికి చొరవ చూపిందని, కుటుంబ వివాదాలతో దూరమైన భార్యాభర్తలను కౌన్సెలింగ్ ద్వారా ఏకం చేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ముందు జాగ్రత్తలు, మైనర్ బాలికలపై జరుగుతున్న ఘోరాలతో పాటు డ్రగ్స్ నివారణ ఇతర అంశాలపై షీ టీమ్ బృందాలు పెద్ద ఎత్తున అవ గాహన కార్యక్రమాలను నిర్వహించాయని తెలిపారు. అనేక భద్రతాపరమైన, సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్మల్ జిల్లా షీ టీమ్ రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరును కనబరిచి మొదటి వరుసలో నిలిచిందని పేర్కొన్నారు.