Reading Time: < 1 minute
Ttd Upgrades Accounting System With Erp Technology After Ram Mandir Donation Controversy

TTD: అయోధ్య రామ మందిరంలో విరాళాల నిర్వహణకు సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న టీటీడీ.. తన అకౌంటింగ్, ఆడిట్ వ్యవస్థలను ఆధునీకరించేందుకు భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ICAI) సహాయాన్ని కోరింది. ఈ విషయాన్ని ICAI అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభమైందని, 100 రోజుల్లో కొత్త వ్యవస్థకు సంబంధించిన రూపకల్పన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

టీటీడీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంటింగ్ వ్యవస్థ దాదాపు రెండు దశాబ్దాలకు ముందు నాటిదని ఆయన అన్నారు. కొత్త విధానాన్ని పూర్తిగా ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ICAIకి చెందిన ప్రత్యేక విభాగం ‘అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టు కేవలం టీటీడీకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర దేవాలయాలు, ధార్మిక & సేవా సంస్థలకు కూడా ఆదర్శంగా నిలవాలని ICAI భావిస్తోంది. టీటీడీ కోసం రూపొందించే అకౌంటింగ్ మాన్యువల్‌ను భవిష్యత్తులో ఇతర సంస్థల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అయోధ్య రామ మందిరంలో వెలుగులోకి వచ్చినట్లు ప్రచారంలో ఉన్న ఆర్థిక అవకతవకలపై స్పందిస్తూ.. తమకు మీడియా కథనాలు మినహా ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే నగదు, చెక్కులు లేదా బ్యాంకింగ్ లావాదేవీలు ఏవైనా సరే.. పటిష్టమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థ ఉంటే నిధుల లీకేజీకి అవకాశం ఉండదని పేర్కొన్నారు. ICAI ఉపాధ్యక్షుడు మంగేష్ పాండురంగ్ కినారే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ కోసం సిద్ధం చేస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గతంలో భారతీయ రైల్వేలు, ఇండియా పోస్ట్ వంటి ప్రభుత్వ సంస్థలకు కూడా ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసిన అనుభవం తమకు ఉందని గుర్తు చేశారు.