
బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్. హైదరాబాద్ లో.. అది కూడా ఐటీ సెక్టార్ కేంద్రీకృతమై ఉన్న సైబరాబాద్ లో వ్యాపారం పెట్టుకునే ఛాన్స్. బిజినెస్ చేయాలంటే డబ్బులు లేవు.. నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అనుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. సైబరాబాద్ లో మీరొక బెస్ట్ బిజినెస్ మన్ కావచ్చు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద స్ట్రీట్ ఫుడ్ హబ్ అభివృద్ధి కోసం సైబరాబాద్ ఎంపికైంది. వీధి వ్యాపారులకు ఫుడ్ బిజినెస్ కోసం ఆర్గనైజ్డ్ స్థలాలను అందించడం, సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీసొకొచ్చింది. సౌత్ ఇండియాలో ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ ఎంపిక కావడం విశేషం.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఈ ప్రాజెక్ట్ కోసం షేక్పేట్ ఫ్లైఓవర్ సమీపంలోని రాయిదుర్గ్లో ఉన్న మల్కం చెరువును స్థలాన్ని గుర్తించింది. పీఎం స్వనిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో సుమారు రూ. 4 కోట్ల ఖర్చు చేసి ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ను డెవలప్ చేయనున్నారు.
ఈ స్కీమ్ ప్రకారం.. హబ్ లో 50 స్టాళ్లు ఉంటాయి, వాటిలో 40 వీధి వ్యాపారుల కోసం, 10 మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) కోసం కేటాయిస్తారు. వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వ్యాపారులను.. మంచి సౌకర్యాలతో నిర్దేశించిన హబ్ కిందకు తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
►ALSO READ | తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు..ఈగల్ ఫోర్స్కు ఫుల్ పవర్స్ : డిప్యూటీ సీఎం భట్టి
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) తరపున, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA)కు చెందిన అనిల్ ప్రకాష్ నేతృత్వంలోని ఒక కేంద్ర అంచనా బృందం, తదుపరి చర్యలు తీసుకునే ముందు ప్రతిపాదిత స్థలాన్ని తనిఖీ చేయడానికి మరియు ప్రాజెక్ట్ ప్రణాళికలను సమీక్షించడానికి జూన్ 22 మరియు 23 తేదీలలో సైబరాబాద్ను సందర్శించనుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 4 కోట్లు మంజూరు చేసిందని సీఎంసీ అధికారులు తెలిపారు. వీధి వ్యాపారులకు ప్రత్యేక వ్యాపార స్థలాలను అందించడం, ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటించేలా ప్రోత్సహించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వారు చెప్పారు.
సీసీటీవీ నిఘా, తాగునీటి సౌకర్యాలు, ప్రత్యేక మరుగుదొడ్లు, లైటింగ్, పార్కింగ్ సదుపాయం, ట్రాఫిక్ నిర్వహణ మొదలైన అన్ని చర్యలు తీసుకుంటారు. సీఎంసీ అధికారుల ప్రకారం, ప్రస్తుతం చాలా మంది వీధి వ్యాపారులు శాశ్వత మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యాపార కార్యకలాపాలకు ఒక ఆర్గనైజ్డ్ సౌకర్యాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు 10 స్టాళ్లను కేటాయించడం వెనుక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి ఉద్దేశాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక బిజినెస్ హబ్ ఏర్పడటంతో పాటు ప్రజా సౌకర్యాలు కూడా మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.