
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఆఫీసు పని, ఆన్లైన్ చదువులు, వినోదం, వీడియో కాల్స్.. ఇలా ఏది కావాలన్నా ఈ గాడ్జెట్లు ఉండాల్సిందే. అయితే వీటన్నింటికీ ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న.. ‘‘అసలు ఈ డివైజ్లను రోజూ ఛార్జ్ చేయడం వల్ల ఎంత కరెంట్ కాలుతుంది? దీనివల్ల నెలవారీ విద్యుత్ బిల్లు భారీగా పెరుగుతుందా?’’ దీని వెనుక ఉన్న అసలు లెక్కలు, మనకు తెలియకుండానే జరిగే కరెంట్ వృథా గురించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ఫోన్ ఛార్జింగ్: ఏడాదికయ్యే ఖర్చు వింటే షాక్ అవుతారు..
చాలామంది ఫోన్ ఛార్జింగ్ వల్ల కరెంట్ బిల్లు ఎక్కడ పెరిగిపోతుందో అని కంగారుపడుతుంటారు. కానీ వాస్తవానికి స్మార్ట్ఫోన్లు అతి తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఒక సాధారణ స్మార్ట్ఫోన్ను ప్రతిరోజూ ఛార్జ్ చేసినా.. సంవత్సరానికి కేవలం 3 నుండి 4 యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుంది. మనదేశంలో విద్యుత్ ధరలు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారినప్పటికీ, సగటున ఒక మొబైల్ ఫోన్ను ఏడాది పొడవునా ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 50 నుండి రూ. 60 మాత్రమే. అంటే మీ ఫోన్ను రోజూ ఛార్జ్ చేయడం వల్ల మీ నెలవారీ కరెంట్ బిల్లుపై పెద్దగా ప్రభావమే ఉండదు.
ల్యాప్టాప్లు, టాబ్లెట్ల కరెంట్ లెక్కలివే..
మరోవైపు ల్యాప్టాప్లు, టాబ్లెట్ల కథ కొంచెం వేరుగా ఉంటుంది. ఇవి మొబైల్స్ కంటే పెద్ద బ్యాటరీలను కలిగి ఉండి, ఎక్కువ శక్తిని లాగుతాయి.
ల్యాప్టాప్స్: ఇవి సంవత్సరానికి సుమారుగా 130 నుండి 140 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తాయి. మీ ప్రాంతంలోని విద్యుత్ ధరలను బట్టి దీని వార్షిక ఖర్చు కొన్ని వందల రూపాయల నుండి రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ల్యాప్టాప్లు ఉంటే బిల్లు దానికి అనుగుణంగా పెరుగుతుంది.
టాబ్లెట్లు: ఇవి మొబైల్స్కు, ల్యాప్టాప్లకు మధ్యస్థంగా ఉంటాయి. సాధారణ వాడకం వల్ల వీటికి సంవత్సరానికి సుమారు 15 నుండి 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది.
స్విచ్ ఆన్ చేసి వదిలేస్తున్నారా?
మనం తరచుగా చేసే అతిపెద్ద తప్పు.. ఫోన్ లేదా ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయాక డివైజ్ను పీకేసి, సాకెట్ దగ్గర స్విచ్ ఆన్ చేసే వదిలేయడం. ఛార్జర్ ఖాళీగా ప్లగ్లో ఉన్నప్పటికీ అది కొద్ది మొత్తంలో విద్యుత్ను లాగుతూనే ఉంటుంది. దీనినే టెక్నికల్ భాషలో ఫాంటమ్ పవర్ లేదా స్టాండ్బై పవర్ అంటారు. విడిగా చూస్తే ఈ వినియోగం చాలా తక్కువగా అనిపించినా.. ఇళ్లలో ఉండే అన్ని ఛార్జర్లను ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అనవసరమైన విద్యుత్ వృథాకు మరియు బిల్లు పెరగడానికి కారణమవుతుంది.
కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్..
స్విచ్ ఆఫ్ చేయడం మరవద్దు: డివైజ్ పూర్తిగా ఛార్జ్ అయిన వెంటనే మొబైల్, ల్యాప్టాప్ తీసేయడమే కాదు, మెయిన్ బోర్డులో స్విచ్ కూడా ఆపివేయండి.
అవసరమైనప్పుడే ఛార్జ్ చేయండి: బ్యాటరీ 20శాతానికి పడిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టి.. 80-90శాతం అవ్వగానే తీసేయడం మంచిది. 24 గంటలు ప్లగ్లోనే ఉంచొద్దు.
ఒరిజినల్ ఛార్జర్లు: నాసిరకం ఛార్జర్లు ఎక్కువ వేడెక్కి ఎక్కువ కరెంట్ లాగుతాయి. కాబట్టి ఒరిజినల్ ఛార్జర్లనే వాడండి.