
Kakanmath Temple: చూడగానే కూలిపోతుందేమో అనిపించే ఓ ఆలయం… కానీ వెయ్యేళ్లకు పైగా తట్టుకుని ఇప్పటికీ అచంచలంగా నిలిచి ఉంది. సిమెంట్ లేదు, సున్నం లేదు కేవలం భారీ రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ఎన్నో రహస్య కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు దీనిని దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని నమ్ముతారు. మరికొందరు ఇది ప్రాచీన భారతీయ శిల్పకళకు నిదర్శనమని చెబుతారు. మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లా సిహోనియా గ్రామంలో ఉన్న కాకన్మఠ్ ఆలయం నేటికీ చరిత్రకారులను, పర్యాటకులను, పురాణాలపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తోంది.
11వ శతాబ్దంలో కచ్ఛపఘాట వంశానికి చెందిన రాజు కీర్తిరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. శివుడికి అంకితమైన ఈ ఆలయం ఒకప్పుడు భారీ ఆలయ సముదాయంలో భాగంగా ఉండేది. ప్రధాన ఆలయం చుట్టూ అనేక చిన్న దేవాలయాలు కూడా ఉండేవని పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాల ప్రభావంతో మిగిలిన నిర్మాణాలన్నీ శిథిలాలుగా మారగా, ప్రధాన ఆలయం మాత్రం ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషంగా మారింది.
కాకన్మఠ్ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది దాని నిర్మాణ శైలి. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్, సున్నం ఇతర పదార్థాలు ఉపయోగించలేదని నిపుణులు చెబుతున్నారు. భారీ రాతి బండలను ఒకదానిపై మరొకటి అమర్చే ‘డ్రై స్టోన్ మేసన్రీ’ పద్ధతిలో దీనిని నిర్మించారు. బయట నుంచి చూస్తే రాళ్లు ఎప్పుడైనా జారిపడతాయేమో అనిపించినా, శతాబ్దాలుగా అవి కదలకుండా నిలిచి ఉండటం ఇంజినీరింగ్ పరంగా కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ విశిష్ట నిర్మాణమే ఆలయం చుట్టూ అనేక జానపద కథలకు కారణమైంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, ఈ ఆలయాన్ని మనుషులు కాకుండా అతీంద్రియ శక్తులు ఒక్క రాత్రిలో నిర్మించాయట. తెల్లవారేలోపు పనిని పూర్తి చేయాల్సి ఉండగా, సూర్యోదయం కావడంతో అవి అదృశ్యమై ఆలయం అసంపూర్తిగా మిగిలిపోయిందని చెబుతుంటారు. అందుకే ఆలయం కొంత అసమతుల్యంగా కనిపిస్తుందని స్థానికులు నమ్ముతారు.
మరో పురాణ గాథ ప్రకారం, రాజు కీర్తిరాజ్కు స్వయంగా శివుడు కలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి మార్గనిర్దేశం చేశాడని చెబుతారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎవరూ బయటకు రావద్దని గ్రామస్తులకు ఆదేశించినప్పటికీ, ఒక బాలుడు ఆసక్తితో బయటకు తొంగిచూడడంతో ఆ దివ్య నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ప్రజల్లో ప్రసిద్ధి చెందిన జానపద విశ్వాసాలే తప్ప, వీటికి చారిత్రక ఆధారాలు లేవని పరిశోధకులు పేర్కొంటున్నారు.
చరిత్రకారులు మాత్రం ఈ ఆలయ రహస్యాన్ని శాస్త్రీయ కోణంలో వివరిస్తున్నారు. కచ్ఛపఘాట రాజవంశం కాలంలో అభివృద్ధి చెందిన అత్యున్నత శిల్పకళా నైపుణ్యానికి కాకన్మఠ్ నిదర్శనమని వారు చెబుతున్నారు. రాళ్ల బరువు, సమతుల్యత, ఖచ్చితమైన అమరిక వల్లే ఈ నిర్మాణం ఇంతకాలం నిలిచి ఉందని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మొదట నిర్మించిన పంచాయతన ఆలయ సముదాయంలో ప్రధాన గర్భగుడి మాత్రమే కాలగమనాన్ని తట్టుకుని మిగిలిందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దెయ్యాలు నిర్మించాయా, ప్రాచీన శిల్పులు నిర్మించారా అన్న చర్చ పక్కన పెడితే, కాకన్మఠ్ ఆలయం భారతీయ ప్రాచీన నిర్మాణ కళకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. వెయ్యేళ్లకు పైగా ప్రకృతి విలయాలను తట్టుకుని ఇప్పటికీ నిలిచి ఉన్న ఈ ఆలయం, చరిత్ర, శిల్పకళ, జానపద కథలు ఒకేచోట కలిసిన అరుదైన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.