Reading Time: 2 minutes
Shivam Dubes T20 Stats Go Viral Is Indias All Rounder Still Underrated

టీ20 క్రికెట్‌లో ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత మూడు సంవత్సరాలుగా భారత్ తరఫున శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్, బాల్‌తో జట్టుకు కీలక సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురికి సంబందించిన 2024-2026 వరకు టీ20 ప్రదర్శనల గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా శివమ్ దూబేను ‘మోస్ట్ అండర్‌రేటెడ్ ఆల్‌రౌండర్’గా అభిమానులు పేర్కొన్నారు.

శివమ్ దూబే:
2024లో శివమ్ దూబే బ్యాట్‌తో 296 పరుగులు చేయడంతో పాటు బంతితో 2 వికెట్లు తీశాడు. 2025లో 291 పరుగులు, 12 వికెట్లు సాధించి మెరుగైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. 2026లో మరింత మెరుగ్గా రాణిస్తూ 377 పరుగులు, 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయడంలో దూబే కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అక్షర్ పటేల్:
అక్షర్ పటేల్ మాత్రం బ్యాట్, బాల్ రెండింట్లోనూ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. 2024లో 506 పరుగులు, 37 వికెట్లు తీసి అద్భుత ఆల్‌రౌండ్ రికార్డు నమోదు చేశాడు. 2025లో 446 పరుగులతో పాటు 22 వికెట్లు సాధించగా.. 2026లో ఇప్పటివరకు 209 పరుగులు, 28 వికెట్లు తన పేరుపై నమోదు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో అక్షర్ జట్టుకు ప్రధాన ఆయుధంగా కొనసాగుతున్నాడు.

హార్దిక్ పాండ్యా:
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత మూడు సంవత్సరాల్లో స్థిరమైన ప్రదర్శన చేశాడు. 2024లో 352 పరుగులు, 24 వికెట్లు సాధించిన హార్దిక్.. 2025లో 302 పరుగులు, 12 వికెట్లు పడగొట్టాడు. 2026లో 286 పరుగులు, 13 వికెట్లు నమోదు చేశాడు. కీలక సమయాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యంతో హార్దిక్ ఇప్పటికీ భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

మరింత గుర్తింపు దక్కాల్సింది:
అయితే ఈ గణాంకాల ఆధారంగా సోషల్ మీడియాలో శివమ్ దూబేకు మరింత గుర్తింపు రావాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు కీలక బలంగా నిలుస్తున్నారు. ఒక్క గణాంకాల ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని తేల్చడం కంటే.. మ్యాచ్‌ల ప్రభావం, ప్రత్యర్థి స్థాయి, కీలక సందర్భాల్లో చేసిన ప్రదర్శన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.