
పూణె యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్కు ప్రియుడు చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం ఉందని కుటుంబ సభ్యులకు ముందే తెలిసిందని.. ఆ తర్వాతే ఆమెకు కేతన్ అగర్వాల్తో వివాహం నిశ్చయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. చేతన్ కుటుంబంతో పోలిస్తే కేతన్ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండటంతో ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సియా సోదరుడు సాహిల్ గోయల్ కూడా దృడపరిచాడు. పోలీసులకు కీలక వివరాలు వెల్లడించాడు. తన క్రికెట్ మ్యాచ్లకు సియా తరచూ వచ్చేదని.. ఆ సమయంలోనే సియాకు చేతన్ చౌదరితో పరిచయం ఏర్పడిందని వెల్లడించాడు. అనంతరం గత ఏడాది ఓ ఉమ్మడి స్నేహితుడు నిర్వహించిన దీపావళిలో ఇద్దరూ మళ్లీ కలిశారని.. అప్పటినుంచే సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ స్టేట్మెంట్తో చేతన్ గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలుసని అర్థమవుతోంది. సియా తల్లి మీడియాతో చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది.
ఇక పోలీసుల కస్టడీలో జరిగిన విచారణలో సియా గోయల్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ అంటే ఇష్టం లేదని.. అతను విగ్గు (హెయిర్ ప్యాచ్) ధరించేవాడని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిని రద్దు చేయాలని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదని పోలీసులు ప్రశ్నించగా.. వారిని బాధపెట్టడం ఇష్టం లేక అలా చేయలేదని సియా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అలాగే కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లిని తిరస్కరించడం కంటే.. లోహగడ్ కోట దగ్గర కేతన్ను లోయలోకి తోసేస్తే సమస్య సులభంగా ముగుస్తుందని తాను భావించినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
కేతన్ తండ్రి ఆగ్రహం
ఈ ఆరోపణలపై స్పందించిన కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ వాటిని తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు పూర్తి విగ్గు ధరించలేదని.. కేవలం చిన్న హెయిర్ ప్యాచ్ మాత్రమే ఉపయోగించేవాడని చెప్పారు. ఆ విషయం నిశ్చితార్థానికి ముందే సియా కుటుంబానికి పూర్తిగా తెలుసని తెలిపారు. ‘‘హెయిర్ ప్యాచ్ వేసుకున్నాడనే కారణంతో నా కుమారుడిని హత్య చేయడం సమర్థించలేం. అది హత్యకు కారణం కాలేదు. కాలేదు కూడా.’’ అని విశాల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దర్యాప్తులో భాగంగా ఈ వివాహ సంబంధాన్ని కుదిర్చిన నరేంద్ర మిట్టల్ను కూడా పోలీసులు విచారించారు. లొనావాలా రూరల్ పోలీసులు శుక్రవారం ఆయన నుంచి వివరాలు సేకరించారు. నరేంద్ర మిట్టల్.. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్కు మేనమామ కాగా.. సియా గోయల్ తల్లి పూజా గోయల్కు బంధువు. విచారణలో ఆయన మాట్లాడుతూ.. తన పాత్ర కేవలం రెండు కుటుంబాలను వివాహ సంబంధం కోసం పరిచయం చేయడానికే పరిమితమని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.