Reading Time: 2 minutes
Shamshabad Ganja Smuggling Racket Busted

Ganja Smuggling :  హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌కు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు , 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా టు మహారాష్ట్ర.. స్మగ్లర్ల స్కెచ్ ఇలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని అక్రమంగా తరలిస్తోంది. ఇందుకోసం టాటా హారియర్, మారుతి ఎర్టిగా వంటి లగ్జరీ వాహనాలను వినియోగించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇందులో ఒక వాహనాన్ని ‘పైలట్’ వాహనంగా ముందు పంపిస్తూ.. మార్గమధ్యంలో ఎక్కడైనా పోలీస్ చెక్‌పోస్టులు, తనిఖీలు ఉన్నాయా అనే సమాచారాన్ని వెనుక గంజాయితో వస్తున్న వాహనానికి అందిస్తూ ఎస్కార్ట్‌గా వ్యవహరించేవారు.

నకిలీ నెంబర్ ప్లేట్లు.. ఇంటర్నెట్ కాలింగ్‌తో హైటెక్ మోసం

టోల్ గేట్లలో పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు చాకచక్యంగా వాహనాలకు నకిలీ మహారాష్ట్ర (MH) నెంబర్ ప్లేట్లను ఉపయోగించారు. అంతేకాకుండా, సాధారణ ఫోన్ కాల్స్ చేస్తే పోలీసులు ట్యాప్ చేస్తారనే భయంతో, ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవడానికి కేవలం ఇంటర్నెట్ కాలింగ్ (యాప్స్) మాత్రమే వాడుతూ నిఘా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్ (ORR) గేట్ సమీపంలో ఈ రెండు వాహనాలను అడ్డుకుని గంజాయిని పట్టుకున్నారు.

భారీ లాభాల దందా.. సూత్రధారుల కోసం వేట

స్మగ్లర్లు ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన సరఫరాదారు ప్రభిత్ర ప్రధాన్ నుండి కేవలం రూ. 4 వేలకే కిలో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ గంజాయిని మహారాష్ట్రకు తరలించి అక్కడ వినియోగదారులకు కిలో రూ. 20 వేల నుండి రూ. 30 వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, ఈ ముఠాలో కీలకమైన ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.