Reading Time: 2 minutes
Garuda Puran Rules Dead Person Clothes Belongings At Home Shastra Facts

Garuda Puran: మరణం అనేది సృష్టిలో ఎవరూ మార్చలేని ఒక యదార్థ సత్యం. మనకు అత్యంత ఆప్తులైన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పుడు.. వారు కేవలం జ్ఞాపకాలను మాత్రమే కాదు, తమ వెనుక ఎన్నో ప్రశ్నలను కూడా వదిలి వెళ్తారు. అందులో ప్రధానమైనది.. మరణించిన వ్యక్తి ఉపయోగించిన బట్టలు, నగలు, గడియారం లేదా మంచం వంటి వస్తువులను ఇంట్లో ఉంచవచ్చా? లేదా వాటిని తీసేయాలా? ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించినది మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలతో కూడిన ప్రశ్న. దీనిపై హిందూ ధర్మ శాస్త్రమైన ‘గరుడ పురాణం’ ఏం చెబుతోంది? ఆ వస్తువులను ఏం చేయాలో ఇప్పుడు ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.

గరుడ పురాణం ఏం చెబుతోంది..

గరుడ పురాణం ప్రకారం.. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. మరణించిన తర్వాత కూడా ఆ జీవుడికి తను బతికి ఉన్నప్పుడు ఉపయోగించిన వస్తువులపై, ముఖ్యంగా దుస్తులు, నగలు, గడియారాలపై కొంతకాలం పాటు మోహం ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులను ఇంట్లో అలాగే ఉంచడం వల్ల వారి ఆత్మకు శాంతి లభించదని, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆ బాధ నుంచి త్వరగా కోలుకోలేరని శాస్త్రం చెబుతోంది. భయపడటానికి కాదు కానీ, మానసిక ప్రశాంతత కోసం ఈ వస్తువుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు.

చనిపోయిన వారి బట్టలను ఏం చేయాలంటే..

మనిషి శరీరానికి అత్యంత దగ్గరగా ఉండేవి దుస్తులు. అందుకే వీటితోనే మనుషులకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం.. చనిపోయిన వారి దుస్తులను ఇంట్లో ఎక్కువ కాలం దాచి ఉంచకూడదు. వాటిని గౌరవపూర్వకంగా అవసరమున్న వారికి దానం చేయాలి. దీనివల్ల మరణించిన వారి ఆత్మకు పుణ్యం లభించడమే కాకుండా.. కుటుంబ సభ్యులు ఆ పాత జ్ఞాపకాల బాధ నుంచి త్వరగా బయటపడటానికి వీలవుతుంది.

నగలు, గడియారాల విషయంలో జాగ్రత్తలు

బట్టల లాగా కాకుండా బంగారు, వెండి నగలను కుటుంబ వారసత్వంగా భావిస్తారు. కాబట్టి చనిపోయిన వారి నగలను ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ వాటిని శుద్ధి చేసిన తర్వాతే కొత్తగా ఉపయోగించాలి. అయితే, వారు పెట్టుకున్న చేతి గడియారం విషయంలో జాగ్రత్త అవసరం అని అంటున్నారు. ఒకవేళ ఆ గడియారం ఆగిపోయి ఉంటే లేదా పాడైపోయి ఉంటే.. దానిని ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదట. అది ఆగిపోయిన కాలానికి, ప్రతికూల శక్తికి సంకేతంగా మారుతుందని పెద్దల నమ్మకం.

వారి ఫోటోలను ఎక్కడ పెట్టాలి..

చనిపోయిన పెద్దల ఫోటోలను ఇంట్లోని పూజా గదిలో లేదా దేవుడి పటాల పక్కన పెట్టకూడదు. అలాగే ఇంటి నిండా ప్రతి మూలలోనూ వారి ఫోటోలను తగిలించడం మంచిది కాదు. ఫోటోలను కేవలం పితృ దేవతలకు కేటాయించిన ప్రత్యేక దిశలో (నైరుతి లేదా దక్షిణ గోడపై) మాత్రమే ఉంచాలి. అది కూడా మనకు ప్రేరణనిచ్చేలా ఉండాలి తప్ప, ప్రతిరోజూ చూసి ఏడ్చేలా ఉండకూడదు. మనిషి తన చివరి రోజుల్లో ఉపయోగించిన పరుపు, దుప్పటి, దిండు వంటి వాటిని వెంటనే మార్చేయడం లేదా ఇతరులకు ఇవ్వడం మంచిది. శాస్త్రీయంగా చూసినా కూడా దీర్ఘకాలిక అనారోగ్యంతో చనిపోయిన వారి పరుపుల్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అయితే వారు పడుకున్న మంచం లేదా పలగాన్ని మాత్రం బాగా శుభ్రం చేసి, కడిగిన తర్వాత తిరిగి వాడుకోవచ్చు.

అసలు సందేశం ఇదే..

గరుడ పురాణం చెప్పే అసలు ఉద్దేశం మనుషులను భయపెట్టడం కాదు.. జీవితంలో సమతుల్యతను నేర్పడం. చనిపోయిన వారి వస్తువులను అతిగా దాచుకుని మానసిక భారాన్ని పెంచుకోకూడదు, అలాగని గౌరవం లేకుండా పారేయకూడదు. ఏ వస్తువు మనకు స్ఫూర్తిని ఇస్తుందో, ఏది మానసిక నష్టాన్ని కలిగిస్తుందో గ్రహించి నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం.