Reading Time: < 1 minute
Us Launches Airstrikes On Iran Missile And Drone Bases After Hormuz Attack

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక సరుకు రవాణా నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో, ప్రతీకార చర్యగా అమెరికా శుక్రవారం ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన సున్నితమైన అవగాహన ఒప్పందం అనంతరం అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. దీంతో ఇటీవల అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ చర్యలకు తగిన సమాధానం ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. ప్రతీకార చర్యలు ఉంటాయా అని మీడియా ప్రశ్నించగా, “మీకు త్వరలోనే తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. కొద్ది సేపటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటన విడుదల చేసి, ఇరాన్‌లోని క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, తీరప్రాంత రాడార్ వ్యవస్థలపై అమెరికా యుద్ధ విమానాలు కచ్చితమైన దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

అమెరికా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 25న ఒమన్ తీరానికి సమీపంలో హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వెళ్తున్న సింగపూర్ జెండా కలిగిన “ఎం/వి ఎవర్ లవ్లీ” అనే సరుకు రవాణా నౌకపై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది. అమెరికా బలగాలు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అప్రమత్తంగా కొనసాగుతున్నాయని, అంతర్జాతీయ నౌకాయాన భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక Truth Socialలో చేసిన పోస్టులో, ఇరాన్ నాలుగు వన్-వే అటాక్ డ్రోన్‌లను అంతర్జాతీయ నౌకలపై ప్రయోగించిందని ఆరోపించారు. దీనిని కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన చర్యగా ఆయన అభివర్ణించారు. అమెరికా తాజా దాడులతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఈ పరిణామాలకు ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.