
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ మసాలా సినిమా గుంటూరు కారం. 2024 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాలతో రిలీజైన గుంటూరు కారం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఐతే ఇందులోని ఒక పాట మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. అదే కుర్చీ మడతబెట్టి సాంగ్. సినిమా రిలీజ్కి ముందు ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపించింది. సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిచ్చాయి. ఇక థియేటర్లో అయితే ఈ పాట వచ్చినప్పుడు మహేష్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. థమన్ మాస్ బీట్లకు మహేష్ బాబు ఊర మాస్ స్టెప్పులేయడంతో ఈ పాటకు ఎనలేని క్రేజ్ వచ్చింది.
ఇక కుర్చీ మడతబెట్టి సాంగ్ పాటకు మెయిన్ అట్రాక్షన్ శ్రీలీలనే అని చెప్పవచ్చు. ఇందులో ఆమె వేసిన స్టెప్పులు నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. మొత్తానికి గుంటూరు కారం సినిమా కొంత మందికి నచ్చకపోయినా ఈ సాంగ్ మాత్రం థియేటర్లను షేక్ చేసింది. ఇప్పుడీ పాట యూట్యూబ్ లో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అదేంటంటే.. తెలుగులో అత్యంత వేగంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ‘కుర్చీ మడతపెట్టి’ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండ్ ను చూస్తుంటే త్వరలోనే 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని కూడా అందుకోవడం ఖాయమని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కుర్చీ మడత బెట్టి సాంగ్ కు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. శ్రీకృష్ణ, సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
కుర్చీ మడతబెట్టి వీడియో సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి