
China: డ్రాగన్ దేశం మరోసారి సైనిక కలకలం చెలరేగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తాజాగా ప్రభుత్వ పెద్దలు, మిలిటరీ అధికారులపై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన చర్యలకు దిగారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘శిన్హువా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా ప్రభుత్వం ఒకేసారి ఆరుగురు కీలక మిలిటరీ కమాండర్లతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను వారి పదవుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చట్టాలు చేసే అత్యున్నత అధికారిక సంస్థ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (NPC) ఈ ఎనిమిది మంది సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది.
వేటు పడిన వారిలో పొలిట్ బ్యూరో సభ్యులు కూడా..
తాజాగా తొలగించిన వారిలో చైనా మాజీ ఆర్థిక నియంత్రణ విభాగం (ఫైనాన్షియల్ రెగ్యులేటరీ) అధిపతి లీ యుంఝేతో పాటు, ఇటీవల కాలంలో తీవ్రమైన విచారణను ఎదుర్కొంటున్న కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మా షింగ్రూయ్ వంటి అత్యంత పవర్ఫుల్ నేతలు ఉన్నారు. అయితే ఇంతమంది అగ్రనేతలు, సైనిక అధికారులను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే దానికి సంబంధించిన కారణాలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ విడుదల చేసిన నోటీసులో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీనిపై స్పందించేందుకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ సైతం నిరాకరించింది.
అంతరిక్ష విభాగాధిపతి, ఆర్మీ జనరల్స్ అవుట్
ఈ ప్రక్షాళనలో పదవులు కోల్పోయిన ఆరుగురు మిలిటరీ కమాండర్లలో అత్యంత కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు.
జనరల్ షూ శ్యుఛియాంగ్: చైనా సైన్యానికి (PLA) అవసరమైన ఆయుధాల కొనుగోలు, టెస్టింగ్, డెవలప్మెంట్ను పర్యవేక్షించే ‘ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్’ అధిపతిగా ఈయన వ్యవహరించారు. అంతేకాదు 2022 నుంచి చైనాకు చెందిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమానికి కమాండర్-ఇన్-చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వహించిన అత్యంత కీలక వ్యక్తి ఈయన.
జనరల్ లీ ఫెంగ్బియావో: పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్లో పొలిటికల్ కమిషనర్గా పనిచేశారు.
జనరల్ గువో పుక్షియావో: చైనా ఎయిర్ఫోర్స్లో పొలిటికల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు.
వీరితో పాటు ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ నుంచి వాంగ్ కాంగ్పింగ్, సైబర్స్పేస్ ఫోర్స్ నుంచి ఝాంగ్ మింగ్హువా, ఆర్మీ నుంచి యిన్ హోంగ్షింగ్ వారివారి పదవులను కోల్పోయారు.
తిరుగుబాటు భయమేనా?
గత కొన్ని సంవత్సరాలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దేశంలో అవినీతి నిర్మూలన పేరిట ‘యాంటీ-కరప్షన్’ క్యాంపెయిన్ను నడుపుతున్నారు. ఇందులో భాగంగానే గతంలోనూ పలువురు టాప్ జనరల్స్, మంత్రులపై వేటు పడింది. అయితే ప్రస్తుత చర్య దానికంటే చాలా పెద్దదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైన్యంలో అవినీతిని అణచివేయడానికే ఈ చర్యలా? లేక జిన్పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యంలో లోలోపల ఏమైనా తిరుగుబాటు ప్రక్రియ జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పదవులు కోల్పోయిన అధికారులంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది, వారెవ్వరూ మీడియాకు గానీ, ఇతరులకు గానీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.