Reading Time: 2 minutes
Khalifa Movie Mohanlals Powerful Cameo Revealed By Prithviraj Sukumaran

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖలీఫా’ ఓనం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను పృథ్వీరాజ్ ఎలా ఒప్పించారు? ఆయన ఎలా స్పందించారు? అనే విషయాలను రీసెంట్ గా పృథ్వీరాజ వెల్లడించడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ‘ఖలీఫా’ లాంటి సినిమాను రూపొందించడం అంత సులభం కాదని చెప్పారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టాలంటే కథతో పాటు అద్భుతమైన ప్రెజెంటేషన్ అవసరమని, అయితే ఈ విషయంలో దర్శకుడు వైశాఖ్‌తో పాటు మొత్తం బృందంపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలియజేశారు. ఇక ఈ సినిమా కథ మొదలవగానే తాత పాత్ర వెనుక ఒక పెద్ద కథ ఉందని, మొదట ఈ సినిమా విజయం సాధిస్తే ఆ పాత్రను కేంద్రంగా చేసుకుని ప్రీక్వెల్ తెరకెక్కించాలని అనుకున్నామని వివరించారు.

లండన్‌లో జరిగిన తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత తమలో మరింత నమ్మకం పెరిగిందని పృథ్వీరాజ్ తెలిపారు. అప్పటివరకు కథలో నామమాత్రంగా ఉన్న మాంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రను నేరుగా తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుందని భావించిన తర్వాత, దానికి సరైన నటుడు మోహన్‌లాల్ మాత్రమే అనిపించారని వెల్లడించారు. ఆ తర్వాత మోహన్‌లాల్‌కు ఫోన్ చేసి సరదాగా ఒక ప్రశ్న అడిగానని పృథ్వీరాజ్ గుర్తు చేసుకున్నారు. గతంలో మా నాన్న పాత్రను మీరు పోషించారు, ఇప్పుడు మా తాత పాత్ర కూడా చేస్తారా అని అడిగానని చెప్పారు. దానికి మోహన్‌లాల్ ఎలాంటి సందేహం లేకుండా తప్పకుండా చేస్తానని వెంటనే అంగీకరించారని తెలిపారు. మోహన్‌లాల్ లాంటి సీనియర్ నటుడి సహకారం వల్ల సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ఆమిర్ అలీ అనే శక్తివంతమైన వ్యాపారవేత్త పాత్రలో కనిపించనున్నారు. లండన్, నేపాల్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన భారీ బంగారు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించే కుటుంబ వారసుడిగా ఆయన పాత్ర సాగుతుంది. తన తాత మాంబరక్కల్ అహ్మద్ అలీ నిర్మించిన సామ్రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి జరిగే పోరాటాన్ని యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. 2026 ఆగస్టు 20న ఓనం సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ఖలీఫా పార్ట్ 2’ను కూడా రూపొందించే ప్రణాళికలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ఈ రెండో భాగం 1970ల నేపథ్యంలో సాగే ప్రీక్వెల్‌గా రూపొంది, మోహన్‌లాల్ పోషిస్తున్న మాంబరక్కల్ అహ్మద్ అలీ పాత్ర చుట్టూనే కథ తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పృథ్వీరాజ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలతో ‘ఖలీఫా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.