
న్యూఢిల్లీ: కరాచీలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి వెనక భారత హస్తం ఉందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. పాకిస్తాన్ తన సొంత అంతర్గత భద్రతా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి కొత్త డ్రామాలు ఆడుతోందని మండిపడింది. ఇకనైనా ఇతరులపై నిందలు వేయడం ఆపి.. తమ గడ్డపై నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించడంపై దృష్టి పెట్టాలని దాయాది దేశానికి చురకలంటించింది ఇండియా.
కరాచీ దాడి వెనక ఇండియా ప్రమేయం ఉందని ఆ దేశ మీడియాలో వార్తలు వస్తోన్న క్రమంలో ఈ ఇష్యూపై ఆదివారం (జూన్ 28) కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కరాచీలో ఇటీవల జరిగిన దాడికి సంబంధించి భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పాకిస్తానీ నివేదికలను మేం చూశాము.
వాటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇతరులపై నిందలు వేయడానికి బదులుగా పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై ఆధారపడే తన ధోరణిని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలి’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న సింధ్ రేంజర్స్ కాంపౌండ్పై జూన్ 27న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘోర దాడిలో నలుగురు పారామిలిటరీ సిబ్బంది మరణించారు. పాక్ భద్రతా దళాలు వెంటనే కౌంటర్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఆరుగురు ఉగ్రవాదులను పాక్ దళాలు మట్టుబెట్టాయి. జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. అయినప్పటికీ ఈ దాడి వెనక ఇండియా హస్తం ఉందని పాక్ నిరాధార ఆరోపణలు చేయడం గమనార్హం.